‘ఉపాధి’ లెక్క పక్కా

mgnrega scheme is going to be geo tagging - Sakshi

ఒక పని ఒకేసారి చేయాలని నిర్ణయం

చేసిన పనుల వివరాల సమాచార బోర్డుల ఏర్పాటు

అక్రమాలకు అడ్డుకట్ట వేసేదిశగా కేంద్రప్రభుత్వం అడుగులు

నిర్మల్‌రూరల్‌ : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద చేపట్టే పనుల్లో అవకతవకలు జరగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నాయి. ఆయా గ్రామాల్లో ఇటీవల చేపట్టిన పనులకు సంబంధించిన జియో ట్యాగింగ్‌ అమలు చేసిన ఉపాధి హామీలో అక్రమాలు తగ్గడం లేదు. దీంతో మరిన్ని కొత్త సంస్కరణలు తీసుకువచ్చి ప్రజల్లో జవాబుదారి తనంగా ఉండేలా అధికారులు ఈ పథకంలో మరిన్ని మార్పులు చేస్తున్నారు. ఆయా గ్రామాల్లో ఇటీవలే నిర్వహించిన ఉపాధి హామీ పనుల సమాచారం అందరికి అందుబాటులో ఉండాలని, పూర్తి సమాచారంతో కూడిన నోటీసు బోర్డులను ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే అధికారులు ఆయా గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకంగా గ్రామంలోని ఓ  ముఖ్య కూడళ్లి వద్ద బోర్డులు ఏర్పాటు చేసి పూర్తి సమాచారాన్ని పొందుపర్చుస్తున్నారు.

పనుల వివరాలు

మొత్తం జాబ్‌కార్డులు – 13,450
మొత్తం కూలీలు – 20,140
పనిచేసే కూలీలు10,280
శ్రమశక్తి సంఘాలు – 240

మొత్తం 20,140 కూలీలు...

నిర్మల్‌రూరల్‌ మండలంలో మొత్తం 20,140మంది కూలీలు ఉన్నారు. అదేవిధంగా 13,450మందికి జాబ్‌కార్డులు ఉన్నాయి. ఇందులో 10,280 మంది ప్రతీ రోజు ఉపాధి హామీ పథకం ద్వారా కూలీ పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారు. మొత్తం 240 శ్రమశక్తి సంఘాలు ఉన్నాయి. ఉపాధి నిధులు వృధాకాకుండా చేసిన పనుల్లో నాణ్యత లోపాన్ని సైతం సామాజిక తనిఖీల్లో గుర్తిస్తున్నారు. సామాజిక తనిఖీల ద్వారా గు ర్తించి లోపాలను సంబంధిత ఫీల్డ్‌ అసిస్టె ంట్లు, మెటకు జరిమానా విధిస్తున్నారు.  

ఏడు రికార్డులు నిర్వహణ...

ఉపాధి హామీ పనుల్లో పారదర్శకతను మరింత పెంపొందించడానికి ఏడు రకాల రికార్డులను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం సిబ్బందికి సూచించింది. ఇప్పటివరకు పనుల గుర్తింపు, కూలీ సంఖ్య నమోదు చేయడం, మస్టర్లను వేయడానికి రికార్డులు నిర్వహించే వారు. రికార్డుల నిర్వాహణను పర్యవేక్షించే బాధ్యతలను సంబంధిత ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శులకు అప్పగించారు. పనుల గుర్తింపు, వేతనాల చెల్లింపు, ఫిర్యాదులు ఇలా ఏడు రకాల దస్త్రాలను నిర్వహించాల్సి ఉంటుంది.

 
పనుల్లో పారదర్శకం కోసమే..

ఆయా గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పనుల్లో పారదర్శకత కోసమే ప్రతీ గ్రామంలో బోర్డులను ఏర్పాటు చేస్తున్నాం. ఈ బోర్డుపైన ఆయా గ్రామాల్లో చేపట్టిన పూర్తి సమాచారాన్ని అందుబాటులో ఉంచుతున్నాం. దాదాపు అన్ని గ్రామాల్లో ఈ పనులు జరుగుతున్నాయి. ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు నిరోధించడానికే ప్రభుత్వం ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది.
 – లక్ష్మారెడ్డి, ఏపీవో, నిర్మల్‌రూరల్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top