కల్లు తాగి యువకుడి మృతి | Sakshi
Sakshi News home page

కల్లు తాగి యువకుడి మృతి

Published Sun, Dec 30 2018 2:44 AM

Medak District  Drinking the calf  A young man died - Sakshi

నర్సాపూర్‌ రూరల్‌: మెదక్‌ జిల్లాలో కల్లు తాగి ఒక యువకుడు మృతి చెందగా మరో ఇద్దరు యువకుల పరిస్థితి విషమంగా ఉంది. నర్సాపూర్‌ మండలం గూడెంగడ్డలో శనివారం ఈ సంఘటన చోటుచేసుకుంది. గ్రామస్తులు, బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నర్సాపూర్‌ మండలం అవంచ గ్రామానికి చెందిన గౌండ్ల ఆంజనేయులుగౌడ్‌ (23), కోళ్లఫారం రవి, లొంక రాజు స్నేహితులు. వీరు పక్క గ్రామమైన గూడెంగడ్డకు వెళ్లి శనివారం మధ్యాహ్నం 3 గంటలకు కల్లు దుకాణం పక్కన ఉన్న ఖాళీ ప్రదేశంలో కల్లు తాగారు. కల్లు తాగడం పూర్తవుతున్న సమయంలో ఆంజనేయులుగౌడ్‌ అక్కడికక్కడే మృతి చెందగా.. రవి, లొంక రాజులు సైతం స్పృహ తప్పి పడిపోయారు.

దీనిని గమనించి స్థానికులు ఇద్దరు యువకులను ఆటోలో నర్సాపూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారికి వైద్యం అందించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉండడంతో పెద్ద ఆస్పత్రికి తరలించాలని సూచించారు. దీంతో కుటుంబ సభ్యులు వారిని సంగారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితిపై సంగారెడ్డి ఆస్పత్రి డాక్టర్లను సంప్రదించగా పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని, మరో 24గంటల వరకు ఏమీ చెప్పలేమన్నారు. కాగా, త్వరలో ఆంజనేయులకు పెళ్లి చేయాలన్న ప్రయత్నంలో ఉన్న తల్లిదండ్రులు ఈ సంఘటనతో విషాదంలో మునిగిపోయారు. తండ్రి సత్యగౌడ్, తల్లి ప్రమీల సంఘటన స్థలంలో రోదించిన తీరు అంద రిని కలచివేసింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 

Advertisement
Advertisement