ఇదిగో బహుమతి..  

Medak Collector Plan For Give Bicycle To Government School Students - Sakshi

విద్యాశాఖ వినూత్న ప్రణాళిక

శతశాతం విద్యార్థినులకు సైకిళ్ల నజరానా 

జిల్లాలో పంపిణీకి కలెక్టర్‌ నిర్ణయం

పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరయ్యే విద్యార్థుల్లో ఉత్తీర్ణతశాతం ఎక్కువగా ఉంటుంది. అందుకే  విద్యార్థులను ప్రతీ రోజు పాఠశాలకు వచ్చేలా విద్యాశాఖ అధికారులు చొరవ చూపుతున్నారు. ఈ మేరకు జిల్లాలో ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వందశాతం ఉత్తీర్ణత ఉన్న విద్యార్థినులకు సైకిళ్లను బహూకరించనున్నట్లు కలెక్టర్‌ ధర్మారెడ్డి ప్రకటించారు. ఇప్పటికే ఆగస్టు నెలను హాజరు మాసంగా ప్రకటించారు. దీని ద్వారా వందశాతం హాజరు ఉన్న విద్యార్థినులను ప్రోత్సహించడంతోపాటు ఎక్కువ మంది విద్యార్థినులను పాఠశాలకు వచ్చేలా ఉపయోగపడనుంది.  

సాక్షి, పాపన్నపేట: ఈనెల 2న వనపర్తి ఉన్నత పాఠశాల విద్యార్థిని నందినికి ఊహించని బహుమతి లభించింది. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జనార్ధన్‌రెడ్డి ఆ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలకు క్రమం తప్పకుండా వస్తున్న విద్యార్థినిని గుర్తించారు. వెంటనే ఆమెకు అక్కడికక్కడే ఒక సైకిల్‌ బహుమతిగా ఇచ్చి ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఇది హాజరు మాసోత్సవంలో భాగంగా విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచేందుకు తీసుకున్న చర్య అని తెలిపారు.’ ప్రస్తుతం మెదక్‌ జిల్లా కలెక్టర్‌  ధర్మారెడ్డి అదేబాటకు శ్రీకారం చుడుతున్నారు. పాఠశాలకు క్రమం తప్పకుండా వస్తున్న విద్యార్థినుల సమాచారాన్ని సేకరిస్తున్నారు.వీరిలో కొందరికి సైకిళ్లు ఇచ్చేందుకు  సిద్ధమవుతున్నట్లు సమాచారం.

పాఠశాలపై ఆసక్తి కలిగించేలా..
శతశాతం హాజరు సాధించే విద్యార్థి తరగతికి తగిన సామర్థ్యాలు సాధిస్తారన్నది కాదన లేని నిజం.  పాఠశాల అంటే విద్యార్థికి ఆసక్తి కలిగించే దిశగా విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్‌రెడ్డి వినూత్న ప్రణాళికకు శ్రీకారం చుట్టారు. హాజరు శాతం పెంచేందుకు ఆగస్టు నెలను ‘హాజరు మాసంగా’ ప్రకటించారు.ఈ క్రమంలో పాఠశాలలను తనిఖీ చేసిన ఆయన ఒక విద్యార్థినికి సైకిల్‌ బహుమతి ఇచ్చిన వార్త వైరల్‌ అయ్యింది. ఈ ప్రోత్సాహకం సత్ఫలితాన్ని ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా అమలు పర్చేందుకు అవకాశాలు వెతుకుతున్నారు. 

ట్రావెల్‌ అలవెన్స్‌ ఇచ్చే అవకాశం! 
గతంలో 1998లో అప్పటి ప్రభుత్వం చుట్టు ప్రక్కల గ్రామాల నుంచి పాఠశాలలకు వస్తున్న విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేశారు. ఇది బాలికా విద్య పెరగడానికి కొంత వరకు దోహద పడింది. ప్రస్తుతం 3 నుంచి 5 కి.మీ దూరం నుంచి పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు ప్రతీ నెలా రూ.300 ట్రావెలింగ్‌ అలవెన్స్‌గా ఇచ్చేందుకు ప్రభుత్వం దరఖాస్తులు కోరింది.

దాతల సహకారంతో.. 
హాజరు శాతం పెంచేందుకు సైకిళ్లు పంపిణీ చేయాలని విద్యాశాఖ భావిస్తుంది. ఇందుకు గాను కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కింద ముందుకు వచ్చే కంపెనీల ప్రతినిధులను సంప్రదిస్తున్నారు.ఈ క్రమంలో ప్రతీ రోజు ఒక్కో కంపెనీతో అధికారులు మాట్లాడుతున్నట్లు తెలుస్తుంది. 

ప్రత్యేక పోర్టల్‌ ఏర్పాటు..
100 శాతం హాజరు ఉన్నవారికి మొదటి ప్రాధాన్యతగా గుర్తించి సైకిళ్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. బడుల్లో నెలకొని ఉన్న మౌలిక సమస్యలు తీర్చేందుకు ఇప్పటికే విద్యాశాఖ ఒక ప్రత్యేక పోర్టల్‌ను  ప్రారంభించింది.ఈ పోర్టల్‌ ద్వార సహాయం చేసే దాతలకు ఐటీ వెసులు బాటు ఉంటుందని అధకారులు స్పష్టం చేశారు. దీం తో ఇప్పటికే ఎల్‌ఐసీ, ఐకియా, సంప్రదింపులు జరిపి ఫలితాలు సాధించినట్లు సమాచారం.

మెదక్‌ జిల్లాలో సైతం.. 
విద్యాశాఖపై ప్రత్యేక దృష్టి పెట్టిన జిల్లా కలెక్టర్‌ ధర్మారెడ్డి ఈ విషయమై వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. పాఠశాలకు క్రమం తప్పకుండా వచ్చే విద్యార్థినుల వివరాలు సేకరించాల్సిందిగా విద్యాశాఖ అధికారులకు సూచించనున్నట్లు తెలుస్తుంది. ఈనెల 15న గాని అంతకు ముందు గాని శతశాతం హాజరు గల విద్యార్థినులకు సైకిళ్ళు అందజేసేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది.మెదక్‌ జిల్లాలో మొత్తం 141 ఉన్నత,133 ప్రాథమికోన్నత,623 ప్రాథమిక పాఠశాలలు,15 కేజిబివిలు,7 మోడల్‌ స్కూళ్లు ఉన్నాయి.  80 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు.అందులో సుమారు 40వేల మంది విద్యార్థినులున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top