కేసీఆర్తో తేల్చుకుంటాం | mahila garjana in hyderabad on june 5 | Sakshi
Sakshi News home page

కేసీఆర్తో తేల్చుకుంటాం

May 14 2015 10:41 PM | Updated on Sep 3 2017 2:02 AM

కేసీఆర్తో తేల్చుకుంటాం

కేసీఆర్తో తేల్చుకుంటాం

మహిళలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చూపుతున్న వివక్షకు వ్యతిరేకంగా మహిళా తిరుగుబాటు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మహాజన సోషలిస్టు పార్టీ (ఎమ్మెస్పీ) అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు.

వరంగల్(హన్మకొండ): మహిళలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చూపుతున్న వివక్షకు వ్యతిరేకంగా మహిళా తిరుగుబాటు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మహాజన సోషలిస్టు పార్టీ (ఎమ్మెస్పీ) అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. హన్మకొండలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర మంత్రి వర్గంలో మహిళలకు చోటు కల్పించకుండా చిన్నచూపు చూస్తున్నారని ధ్వజమెత్తారు. మంత్రి వర్గంలో ఆరుగురు మహిళలకు అవకాశముందని చెప్పారు.

చట్టసభలో సభ్యులు కాని నాయిని, తెలంగాణ వ్యతిరేకి తుమ్మల నాగేశ్వర్‌రావును మంత్రి వర్గంలో తీసుకున్న కేసీఆర్.. తెలంగాణ రాష్ర్ట సాధనకు ఉద్యమించిన మహిళా లోకం పట్ల ఎందుకు వివక్ష చూపుతున్నారో చెప్పాలని ప్రశ్నించారు. ఈ అంశలో కేసీఆర్‌తో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నామన్నారు. ఈ క్రమంలోనే జూన్ 5వ తేదీన హైదరాబాద్‌లో మహిళా గర్జనను నిర్వహించనున్నామని తెలిపారు. మంత్రి వర్గంలో మహిళల ప్రాతినిథ్యంపై ఇతర రాజకీయ పార్టీలోని మహిళా విభాగం నాయకులు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు.

వర్గీకరణపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఒప్పిస్తానని చెప్పిన ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఇప్పటికైనా మౌనం వీడాలన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ కార్యక్రమాల అమలులోనూ వర్గీకరణ అమలు కావడం లేదన్నారు. కడియం శ్రీహరి సాంఘీక సంక్షేమశాఖ మంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన జీవోనూ అమలు చేయడం లేదని మందకృష్ణ మాదిగ మండిపడ్డారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement