ఉద్యోగాల పేరుతో టోకరా

L&T And Metro Jobs Fruad Arrest in Hyderabad - Sakshi

ఇద్దరు వ్యక్తుల అరెస్ట్‌

ఉప్పల్‌: ఎల్‌అండ్‌టీ మెట్రో రైల్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను ఉప్పల్‌ పోలీసులు గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.  ఉప్పల్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్లు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.  నెల్లూరు జిల్లాకు చెందిన వెలగపూడి రామకృష్ణ హైదరాబాద్‌లోని అంబర్‌పేట్‌ తిలక్‌నగర్‌లో ఉంటూ పలు విభాగాల్లో పబ్లిక్‌ రిలేషన్‌ అఫీసర్‌గా పని చేస్తున్నాడు. అతను నిజామాబాద్‌ జిల్లా ఫతేనగర్‌కు చెందిన చిల్లా మహాలక్ష్మి, మిషన్‌ భగీరథలో డీఈగా పని చేస్తున్న తన బావ బండారు లక్ష్మణ్‌రావు, హైకోర్టు న్యాయవాది గడ్డం శ్రీధర్‌రెడ్డి కలిసి ముఠాగా ఏర్పడ్డారు. ఎల్‌అండ్‌టిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని తెలుగు రాష్ట్రాలకు చెందిన  161 మంది నిరుద్యోగులకు ఎర వేశారు.

వారి నుంచి రూ 80 లక్షలు వసూలు చేశారు.  రామకృష్ణ వారిలో కొందరిని నకిలీ ఆర్డర్‌ కాపీలు తయారు చేసి ఇచ్చాడు. దిల్‌సుఖ్‌నగర్‌ త్రివేణినగర్‌కు  చెందిన లావణ్య అనే యువతి ఫిర్యాదు చేయడంతో ఈ నెల 9న కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన ఉప్పల్‌ పోలీసులు గురువారం రామకృష్ణ, మహాలక్ష్మిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.  వీరిపై నగరంలోని  పలు పోలీస్‌స్టేషన్ల పరిధిలో 15 కేసులు ఉన్నట్లు తెలిపారు. మరో ఇద్దరు నిందితులు గడ్డం శ్రీధర్‌రెడ్డి, బండారు లక్ష్మణ్‌రావు పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితుల నుంచి కారు, రెండు సెల్‌ఫోన్లు, నకిలీ ఆర్డర్‌ కాపీలు, రూ రూ.70వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top