నగరంలో రూపాయి పెట్టుబడికి రెట్టింపు రాబడి  | KTR at Telangana Builders Federation Meeting | Sakshi
Sakshi News home page

నగరంలో రూపాయి పెట్టుబడికి రెట్టింపు రాబడి 

Apr 6 2019 5:05 AM | Updated on Apr 6 2019 5:05 AM

KTR at Telangana Builders Federation Meeting - Sakshi

హైదరాబాద్‌: దేశంలోనే అత్యుత్తమ జీవన ప్రమాణాలు కలిగిన నగరంగా హైదరాబాద్‌ వరుసగా ఐదోసారి ఎంపికైందని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారక రామారావు అన్నారు. హైదరాబాద్‌లో రూపాయి పెట్టుబడి పెడితే అంతకు రెట్టింపు రాబడి వస్తుందని అన్నారు. శుక్రవారం ఇక్కడి తాజ్‌ డెక్కన్‌లో జరిగిన తెలంగాణ బిల్డర్స్‌ ఫెడరేషన్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశానికి కేటీఆర్‌తోపాటు సికింద్రాబాద్‌ టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి తలసాని సాయికిరణ్‌ యాదవ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా బిల్డర్స్‌ ఫెడరేషన్‌ సాయికిరణ్‌యాదవ్‌కు మద్దతు తెలిపింది. అనంతరం కేటీఆర్‌ మాట్లాడుతూ బిల్డర్స్‌కు స్వీయ నియంత్రణ ఉండాలని, లంచాలతో మేనేజ్‌ చేస్తే వారి బ్రాండ్‌ దెబ్బతింటుందని అన్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. నిర్మాణ రంగంలో తెలంగాణ అగ్రగామిగా ఉందన్నారు. ఈ రంగంలో ఉన్న సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని హామీనిచ్చారు.

ఐదేళ్లుగా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధితో బిల్డర్స్‌కు లాభం కలిగిందని పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాల్లో కూడా భూరికార్డుల ప్రక్షాళన చేయాలని సీఎం కేసీఆర్‌ గట్టి సంకల్పంతో ఉన్నారని చెప్పారు. ప్రభుత్వంలో ఉన్న లోపాలను సరిచేసుకుంటూ ముందుకు వెళ్తే మన లక్ష్యాలను సాధించవచ్చని పేర్కొన్నారు. కేసీఆర్‌లాగా యువరైతుకు ఫోన్‌ చేసి అరగంట సేపు మాట్లాడి సమస్యను పరిష్కరించిన సీఎం దేశంలో మరెవరూ లేరన్నారు. కేసీఆర్‌కు వేరే ఎజెండాలు కూడా లేవని, రాష్ట్ర అభివృద్ధే ఆయన ఎజెండా అని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బిల్డర్స్‌ ఫెడరేషన్‌ చీఫ్‌ అడ్వైజర్‌ జక్కా వెంకట్‌రెడ్డి, చైర్మన్‌ పద్మారెడ్డి, అధ్యక్షుడు రమేశ్, ప్రధాన కార్యదర్శి కరుణాకర్‌రెడ్డి, ట్రెజరర్‌ సతీశ్‌రెడ్డి, కార్యనిర్వాహక సభ్యులు సత్యనారాయణ, యాదవరెడ్డి, అనంతరెడ్డి తదితరులు పాల్గొన్నార 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement