కన్నారెడ్డి ఘటనపై విచారణకు కేటీఆర్‌ ఆదేశం | KTR mandate to inquire into the case of Kannareddy | Sakshi
Sakshi News home page

కన్నారెడ్డి ఘటనపై విచారణకు కేటీఆర్‌ ఆదేశం

Jun 1 2017 2:01 AM | Updated on Aug 30 2019 8:24 PM

కన్నారెడ్డి ఘటనపై విచారణకు కేటీఆర్‌ ఆదేశం - Sakshi

కన్నారెడ్డి ఘటనపై విచారణకు కేటీఆర్‌ ఆదేశం

వికారాబాద్‌ జిల్లా మోమిన్‌పేట మండలం ఎర్రవల్లి గ్రామానికి చెందిన కన్నారెడ్డిని పోలీసులు చితకబాదిన ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌

సాక్షి, వికారాబాద్‌: వికారాబాద్‌ జిల్లా మోమిన్‌పేట మండలం ఎర్రవల్లి గ్రామానికి చెందిన కన్నారెడ్డిని పోలీసులు చితకబాదిన ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ బుధవారం సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎరువుల దుకాణం ఏర్పాటుకు అనుమతి విషయంలో కన్నారెడ్డి, మండల వ్యవసాయాధికారి (ఏఓ) నీరజ మధ్య జరిగిన వాగ్వాదం పోలీసు కేసుకు దారి తీసింది. ఈ విషయంలో స్పందించిన మోమిన్‌పేట ఎస్‌ఐ రాజు.. కన్నారెడ్డిని పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి చితకబాదిన సంగతి తెలిసిందే.

ఈ వార్త ప్రసార మాధ్యమాల్లో హల్‌చల్‌ చేయడంతో ఎస్‌ఐ, ఏఎస్‌ఐ, ఇద్దరు హెడ్‌కానిస్టేబుళ్లు, ఇద్దరు కానిస్టేబుళ్లను ఎస్పీ కార్యాలయానికి అటాచ్‌ చేసిన విషయం తెలిసిందే. దీంతోపాటు ఏఓ నీరజపై జిల్లా వ్యవసాయాధికారి గోపాల్‌ విచారణకు ఆదేశించారు. కాగా.. పోలీసుల దెబ్బలకు తీవ్ర అస్వస్థతన గురైన కన్నారెడ్డికి రెండు కిడ్నీలు పాడైపోవడంతో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం విదితమే.  ఈ కేసుపై స్పందించిన మంత్రి కేటీఆర్‌ సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. కాగా.. ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులు, వ్యవసాయాధికారిపై సొంత శాఖకు చెందిన ఉన్నతాధికారులే విచారణ చేస్తుండడంతో న్యాయం జరగదని బాధితులంటున్నారు.  మెజిస్ట్రీరియల్‌ విచారణ చేయించాలని ప్రజాసంఘాల నేతలు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement