కేటీఆర్‌ది బూటకపు ప్రచారం: ఉత్తమ్‌  | KTR did nothing with 16 MPs on his side | Sakshi
Sakshi News home page

కేటీఆర్‌ది బూటకపు ప్రచారం: ఉత్తమ్‌ 

Mar 25 2019 3:15 AM | Updated on Sep 19 2019 8:44 PM

KTR did nothing with 16 MPs on his side  - Sakshi

మిర్యాలగూడ: పార్లమెంట్‌ ఎన్నికల్లో 16 సీట్లు గెలిస్తే కేంద్రంలో చక్రం తిప్పుతామని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ బూటకపు ప్రచారం చేస్తూ డ్రామాలు ఆడుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో సీఎల్పీ మాజీ నేత జానారెడ్డితో కలసి ఆయన మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ ఎంపీలు పార్లమెంట్‌లో ఏనాడూ నోరుమెదపలేదన్నారు. ఇప్పుడు టీఆర్‌ఎస్‌కు 16 సీట్లు ఉన్నా ఏమీ చేయలేదని, ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లేనన్నారు. నోట్ల రద్దుతోపాటు జీఎస్‌టీ విషయంలో కూడా మాట్లాడలేదని విమర్శించారు.

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి టీఆర్‌ఎస్‌ మద్దతు ఇచ్చిందని గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు సానుకూల పవనాలు వీస్తున్నాయని, కాబోయే ప్రధాని రాహులేనని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరగాలంటే కాంగ్రెస్‌ ఎంపీలను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో ఒక సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తామని, ప్రాజెక్టుకు 90 శాతం నిధులు తెస్తామని చెప్పారు. బయ్యారం ఉక్కు కర్మాగారం నిర్మిస్తామన్నారు. రంగారెడ్డి–హైదరాబాద్‌ లో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement