నాతో ఉంటే దేశ భక్తుడివి.. లేకపోతే.. : కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : నాతో ఉంటే దేశ భక్తుడివి.. లేకపోతే దేశ ద్రోహివి అన్న పరిస్థితులు ఇప్పుడు దేశంలో దాదాపుగా ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్.. నాథూరామ్ గాడ్సేను దేశ భక్తుడు అంటే తాను సోషల్ మీడియాలో ఖండించానని తెలిపారు. శనివారం తెలంగాణ వికాస సమితి మూడవ రాష్ట్ర మహాసభలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాధ్వి ప్రజ్ఞాసింగ్ కామెంట్లను సమర్థిస్తూ ట్విటర్లో తనపై కామెంట్స్ రావడం బాధ కలిగించిందన్నారు.
జాతిపితను గౌరవించుకోలేని జాతి మనది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో మతం, జాతీయ వాదం పెనవేసుకొనిపోయాయన్నారు. దేశంలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయని, తర్కించి.. విభేదించే పరిస్థితి లేకపోతే ప్రజాస్వామ్యానికి అర్థం లేదని పేర్కొన్నారు. ఉదాత్తమైన ఆశయంతో తెలంగాణ వికాస సమితి ఏర్పడిందని తెలిపారు. తెలంగాణలో తరతరాలుగా మత భేదం లేకుండా ప్రజా జీవనం కొనసాగుతోందన్నారు.