తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాతే బోధన్లోని నిజాం షుగర్ ఫ్యాక్టరీకి గడ్డుకాలం ఎదురైందని, దీంతో చెరుకు రైతులు కష్టాల పాలవుతున్నారని జేఏసీ చైర్మన్, ప్రొఫెసర్ కోదండరాం అన్నారు.
నిజామాబాద్: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాతే బోధన్లోని నిజాం షుగర్ ఫ్యాక్టరీకి గడ్డుకాలం ఎదురైందని, దీంతో చెరుకు రైతులు కష్టాల పాలవుతున్నారని జేఏసీ చైర్మన్, ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ రక్షణ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడారు. నిజాం కాలంలో వెలుగు వెలిగిన ఫ్యాక్టరీకి చంద్రబాబు అధికారంలోకి వచ్చాకే కష్టాలు మొదలయ్యాయని చెప్పారు.
చెరుకు పండని మిర్యాలగూడ ప్రాంతంలో షుగర్ ఫ్యాక్టరీని నెలకొల్పి బోధన్ ఫ్యాక్టరీని కష్టాలకు గురిచేశారన్నారు. దీనిని విక్రయించే యోచనతో టెండర్లు సైతం పిలిచారని అన్నారు. చెరుకు రైతులు బలహీనులు అయినందునే టీడీపీ ప్రభుత్వం వారిని మోసం చేసిందని ఆరోపించారు. ఫ్యాక్టరీని జాతీయం చేసేవరకు జేఏసీ రైతులకు అండగా ఉండి ఉద్యమిస్తుందని హామీ ఇచ్చారు.