
ఇక.. ఈ-పంచాయతీలే
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఈ పంచాయతీ’ కార్యక్రమానికి జిల్లాలో 320 గ్రామ పంచాయతీలను ఎంపిక చేశారు.
తొలివిడతగా 320 గ్రామాల్లో అమలు
- రెండో విడతలో 1011 పంచాయతీలు
- గ్రామాల పూర్తి సమాచారం ఆన్లైన్లోనే...
- ప్రభుత్వ నిధులు, మౌలిక సదుపాయాల వివరాలు కూడా అందులోనే
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఈ పంచాయతీ’ కార్యక్రమానికి జిల్లాలో 320 గ్రామ పంచాయతీలను ఎంపిక చేశారు. ఈ మేరకు తొలిదశలో మేజర్ గ్రామపంచాయతీలను ఎంపిక చేసి, ఆయా గ్రామాల్లో ఈ ప్రాజెక్టును అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. మలి, తుదిదశల్లో జిల్లాలోని మిగతా గ్రామాలను ఈ పంచాయతీలుగా చేయాలని యోచిస్తున్నారు.
ఏదైనా ఆన్లైన్లోనే..
ఈ పంచాయతీ ప్రాజెక్టు ద్వారా క్షేత్రస్థాయిలో సమాచారాన్నంతటినీ ఆన్లైన్లో నిక్షిప్తం చేయనున్నారు. గ్రామంలో పన్ను వసూలు ద్వారా ఎంత ఆదాయం వస్తుంది. ఆ గ్రామానికి వివిధ పన్నుల ద్వారా స్థానికంగా వస్తున్న ఆదాయం ఎంత? అందులో ఎంత ఖర్చు అవుతోంది? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృ ద్ధి కోసం గ్రామానికి ఎంత కేటాయిస్తున్నారు? రోడ్లు, నల్లాలు, బోర్లు, చే తిపంపులు...ఇలాప్రతి అంశాన్ని ఆన్లైన్ చేస్తారు. వీటితో పా టు గ్రామంలో జనన, మరణాలనమోదుకు సంబంధించిన బా ధ్యతను పంచాయతీ కార్యదర్శికి అప్పగించి, వాటి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయిస్తామని అధికారులు చెబుతున్నారు.
ప్రక్రియ మొదలు...
జిల్లాలో తొలి విడతగా 320 గ్రామాలను ఇప్పటికే ఎంపిక చేశారు. ఇప్పటికే ఆయా గ్రామ పంచాయతీలకు కంప్యూటర్లను సమకూర్చారు. వీటిలో 114 గ్రామ పంచాయతీలకు బ్రాడ్బ్యాండ్ కనె క్షన్ ఇచ్చారు. మిగతా వాటికి బీఎస్ఎన్ఎల్ ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వనున్నారు. ఈ పంచాయతీలకు కంప్యూటర్ ఆపరేటర్ల ఎంపికను ఓ ప్రైవేట్ సంస్థకు అప్పగించారు. వీరిని ఎంపిక చేసి శిక్షణను కూడా ఇవ్వనున్నారు. ఇప్పటికే 176 మంది ఆపరేటర్లను తీసుకున్నారు. వీరు మూడు రోజులకు ఓ గ్రామంలో చొప్పున రెండు గ్రామపంచాయతీల్లో పని చేయాల్సి ఉంటుంది. రెండో విడతలో 1011 గ్రామ పంచాయతీలను ఆన్లైన్ చేయనున్నట్లు సమాచారం. ఇందుకోసం గ్రామ పంచాయతీలను గుర్తించే పనిని బీఎస్ఎన్ఎల్కు అప్పజెప్పినట్లు తెలుస్తుంది. ఏఏ గ్రామాల్లో ఇంటర్నెట్ ఉందనే విషయాన్ని గుర్తించాలని ఆశాఖకు అప్పజెప్పినట్లు సమాచారం.