సీఎం కేసీఆర్కు రాజకీయంగా, వ్యక్తిగతంగా అభద్రతా భావముందని ఆయన అన్నకూతురు రేగులపాటి రమ్య వ్యాఖ్యానించారు.
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్కు రాజకీయంగా, వ్యక్తిగతంగా అభద్రతా భావముందని ఆయన అన్నకూతురు రేగులపాటి రమ్య వ్యాఖ్యానించారు. పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సమక్షంలో బుధవారం ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా రమ్య మాట్లాడుతూ.. రాజకీయ అభద్రత వల్లనే ఇతర పార్టీల నుంచి చేరికలు ప్రోత్సహిస్తున్నాడని విమర్శించారు. అబద్ధాలు చెప్పడం చిన్నాన్న(కేసీఆర్)కు చిన్నప్పటి నుంచి అలవాటేనని ఇంట్లోవారందరూ అంటుండేవారని ఆమె చెప్పారు.
రామోజీ ఫిలింసిటీలో అసైన్డు భూములున్నాయని టీఆర్ఎస్ ఆవిర్భావంలోనే కేసీఆర్ చెప్పారని, ఇప్పుడేమో మాటమారుస్తున్నారని పేర్కొన్నారు. ఆయన ఇంకా ఉద్యమకారుడిననే అనుకుంటున్నారని అందుకే నోటికొచ్చినట్లుగా మీడియాను పాతరేస్తానంటూ మాట్లాడుతున్నారని మండిపడ్డారు.