జిల్లాల్లో పరిస్థితి ఏంటి? | KCR to make review on Party before Budget sessions | Sakshi
Sakshi News home page

జిల్లాల్లో పరిస్థితి ఏంటి?

Oct 22 2014 3:02 AM | Updated on Aug 15 2018 9:22 PM

బడ్జెట్‌కు ముందు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పార్టీ పరంగా భారీ కసరత్తు చేస్తున్నారు.

24న టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో భేటీ కానున్న ముఖ్యమంత్రి కేసీఆర్
 
 సాక్షి, హైదరాబాద్: బడ్జెట్‌కు ముందు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పార్టీ పరంగా భారీ కసరత్తు చేస్తున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక కేసీఆర్ ఇప్పటిదాకా జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో సమీక్షలు నిర్వహించలేదు. బడ్జెట్ ముందు ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని నిర్ణయించారు. నవంబరు మొదటి వారంలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నందున ఈనెల 24న పార్టీ శాసనసభాపక్ష సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. అలాగే జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో విడివిడిగా భేటీ కావాలని నిర్ణయించారు.  అదేరోజు సాయంత్రం మంత్రివర్గ సమావేశం ఉన్నందున.. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించే జిల్లాల వారీ సమీక్షల్లో తన దృష్టికి వచ్చిన అంశాలు, ఎమ్మెల్యేలు చేసిన ముఖ్య సూచనలపై చర్చించి బడ్జెట్‌లో వాటిని పొందుపరిచే విధంగా కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు.
 
 దీపావళి మరుసటి రోజున ఉదయం ముందుగా పార్టీ శాసనభాపక్షం భేటీ కాబోతోంది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలు, జిల్లాలపై వాటి ప్రభావం, విద్యుత్ సంక్షోభం, వర్షాభావ పరిస్థితులు, ప్రతిపక్షాల విమర్శలు, వాటిని తిప్పికొడుతున్న తీరు... ఇలా అన్ని అంశాలపై అందులో చర్చించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఆ తర్వాత విడివిడిగా ఒక్కో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. అరగంట నుంచి గంట సమయాన్ని ఒక్కో జిల్లాకు కేటాయించనున్నారు. స్థానికంగా ఉన్న సమస్యలు, రైతులు, వ్యవసాయ పరిస్థితి, నిధుల అవసరం, పథకాల తీరుతెన్నులు, వాటిలో మార్పుచేర్పులు, కావాల్సిన నిధులు తదితర అంశాలకు సంబంధించి ఎమ్మెల్యేల నుంచి సమాచారాన్ని స్వీకరించనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement