మూడు ‘ముళ్ల’ బంధం

issues on nri marriages - Sakshi - Sakshi - Sakshi - Sakshi - Sakshi

రాష్ట్రంలో రెండేళ్లలో నమోదైన వరకట్నం, వేధింపుల కేసులు - 339

ఎన్నారై పెళ్లిళ్లు.. ఎన్నెన్నో కష్టాలు

పరిస్థితి ఇలాగే ఉంటే పంజాబ్‌ను మించిపోనున్న తెలంగాణ 

ఉన్న ఆస్తులన్నీ అమ్మి ఇచ్చినా ఇంకా కావాలంటున్న ‘వరుడు’

అమ్మాయి తల్లిదండ్రులకు మానసిక వ్యథ

పెళ్లి హిందూ చట్టం.. విడాకులు విదేశీ చట్టం

చట్టానికి చిక్కకుండా తప్పించుకుంటున్న వైనం

అబ్బాయి గురించి పూర్తిగా తెలుసుకోవాలంటున్న పోలీసులు

స్వాతి.. నల్లగొండ జిల్లా.. అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న కిరణ్‌తో పెళ్లి జరిపించారు ఆమె తల్లిదండ్రులు.. ఇరవై లక్షల కట్నమిచ్చారు.. కానీ ఆరు నెలల్లోపే స్వాతిని అమెరికా నుంచి ఇంటికి పంపించేశాడు కిరణ్‌. తల్లిదండ్రులు అదేంటని అడిగితే.. స్వాతి నచ్చలేదని, మరింత కట్నం కావాలని, అప్పటిదాకా మీ వద్దే ఉంచుకోవాలని సమాధానం. ఇప్పటికే ఉన్నదంతా అమ్మి కట్నమిచ్చిన ఆ తల్లిదండ్రులు తలపట్టుకున్నారు. దిక్కుతోచక హైదరాబాద్‌లోని మహిళా పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు! ..ఇది ఒక్క స్వాతి కథే కాదు.. రాష్ట్రంలో అనేక మంది అమ్మాయిలది, వారి తల్లిదండ్రులది ఇదే వ్యథ!! 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎన్నారై పెళ్లిళ్ల మోసాలు, వరకట్న వేధింపులు, విడాకుల కేసులు ఏటేటా పెరిగిపోతున్నాయి. ఇందులో రాష్ట్రం పంజాబ్‌ను సైతం మించిపోయే ప్రమాదం కనిపిస్తోంది. ఎన్నారై మోసాలకు సంబంధించి పంజాబ్‌లో దేశంలోనే అత్యధికంగా ప్రతినెలా 60 కేసులు నమోదవుతున్నట్టు జాతీయ మహిళా కమిషన్‌ 2015లో తెలిపింది. ఇప్పుడు తెలంగాణలో వాటిని మించి నమోదవుతున్నట్టు రాష్ట్ర మహిళా కమిషన్, పలు స్వచ్ఛంద సంస్థలు పేర్కొంటున్నాయి.

పెరుగుతున్న కేసులు..
రాష్ట్రంలో గత రెండేళ్లలో ఎన్నారై పెళ్లిళ్లకు సంబంధించి అదనపు వరకట్నం, వేధింపుల కింద 339 కేసులు నమోదైనట్టు పోలీస్‌ శాఖ లెక్కలు చెబుతున్నాయి. హైదరాబాద్‌ నగర కమిషనరేట్‌ పరిధిలోనే 136 కేసులు, సైబరాబాద్‌లో 76, రాచకొండలో 32, వరంగల్‌లో 18, కరీంనగర్‌లో 9, నల్లగొండలో 9, మహబూబ్‌నగర్‌లో 12, రంగారెడ్డిలో 9, ఖమ్మంలో 18, ఆదిలాబాద్‌లో 8, నిజామాబాద్‌లో 12 కేసులు నమోదయ్యాయి. ఇలా ఐదేళ్ల నుంచి రాష్ట్రవ్యాప్తంగా సీఐడీ, వివిధ పోలీస్‌స్టేషన్లలో కలిపి మొత్తం 738  కేసులు పెండింగ్‌లో ఉన్నాయని పోలీస్‌ శాఖ చెబుతోంది.

60 శాతం 25 ఏళ్ల లోపు వారే..
ఎన్నారై మోసాలకు సంబంధించిన కేసుల్లో 60 శాతం మంది 25 ఏళ్లలోపున్న అమ్మాయిలే బాధితులుగా ఉన్నారు. పెళ్లైనా ఆర్నెల్ల నుంచి ఏడాది లోపే భర్తలు తిప్పి పంపడం, వరకట్నం కోసం వేధింపులు, నచ్చలేదని పంపించేయడంతో వీరంతా పోలీస్‌ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తోంది. అలాగే బాధితుల్లో 17 శాతం మంది 31 నుంచి 35 ఏళ్లలోపు ఉంటుండగా మిగతావారు 36 ఏళ్ల పైబడిన వారని పోలీస్‌ శాఖ అధ్యయనంలో వెల్లడైంది.

చదువుల దశలోనే సంక్షోభం వైపు..
కొందరు తల్లిదండ్రులు గ్రాడ్యుయేషన్‌ పూర్తవగానే తమ కూతుళ్లకు ఎన్నారై వరుడితో పెళ్లి చేసి పంపేస్తున్నారు. విదేశాలకు వెళ్లిన తర్వాత వారు అక్కడ పీజీ కోర్సుల్లో చేరుతున్నారు. ఇలా అక్కడ చదువుకుంటున్న దశలోనే వెనక్కి వస్తున్న యువతుల సంఖ్య కూడా ఎక్కువే ఉంది. ఎన్నారై కేసుల్లో ఇలాంటివి 38 శాతం దాకా ఉన్నట్టు పోలీస్‌ లెక్కలు స్పష్టంచేస్తున్నాయి. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ కో–ఆపరేషన్, చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ విభాగం చేసిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఇలాంటి వారు అటు చదువు పూర్తి చేయలేక.. ఇటు జరిగిన అన్యాయంపై పోరాటం చేయలేక తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్టు ఆ సర్వేలో తేలింది. ఎన్నారై సంబంధం అనగానే తల్లిదండ్రులు పెళ్లిళ్లకు ఒప్పేసుకోవడం కూడా ప్రధాన సమస్యగా మారింది. దేశవ్యాప్తంగా పలు ఎన్నారై కేసులను పరిశీలించగా అందులో 38 శాతం సంబంధాల్లో మాత్రమే వధువు తల్లిదండ్రులు.. వరుడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకొన్నట్టు స్పష్టమైంది. 22 శాతం పెళ్లి సంబంధాల్లో నామ్‌కేవాస్తేగా విచారణ జరిపినట్టు సర్వేలో తేలింది. అబ్బాయిల గురించి పూర్తిగా తెలుసుకోకుండానే పెళ్లిళ్లు చేయడం వల్ల కూడా సమస్యలు వచ్చిపడుతున్నట్టు వెల్లడైంది.
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top