breaking news
cheating to marriages
-
మూడు ‘ముళ్ల’ బంధం
స్వాతి.. నల్లగొండ జిల్లా.. అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న కిరణ్తో పెళ్లి జరిపించారు ఆమె తల్లిదండ్రులు.. ఇరవై లక్షల కట్నమిచ్చారు.. కానీ ఆరు నెలల్లోపే స్వాతిని అమెరికా నుంచి ఇంటికి పంపించేశాడు కిరణ్. తల్లిదండ్రులు అదేంటని అడిగితే.. స్వాతి నచ్చలేదని, మరింత కట్నం కావాలని, అప్పటిదాకా మీ వద్దే ఉంచుకోవాలని సమాధానం. ఇప్పటికే ఉన్నదంతా అమ్మి కట్నమిచ్చిన ఆ తల్లిదండ్రులు తలపట్టుకున్నారు. దిక్కుతోచక హైదరాబాద్లోని మహిళా పోలీస్స్టేషన్ను ఆశ్రయించారు! ..ఇది ఒక్క స్వాతి కథే కాదు.. రాష్ట్రంలో అనేక మంది అమ్మాయిలది, వారి తల్లిదండ్రులది ఇదే వ్యథ!! సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నారై పెళ్లిళ్ల మోసాలు, వరకట్న వేధింపులు, విడాకుల కేసులు ఏటేటా పెరిగిపోతున్నాయి. ఇందులో రాష్ట్రం పంజాబ్ను సైతం మించిపోయే ప్రమాదం కనిపిస్తోంది. ఎన్నారై మోసాలకు సంబంధించి పంజాబ్లో దేశంలోనే అత్యధికంగా ప్రతినెలా 60 కేసులు నమోదవుతున్నట్టు జాతీయ మహిళా కమిషన్ 2015లో తెలిపింది. ఇప్పుడు తెలంగాణలో వాటిని మించి నమోదవుతున్నట్టు రాష్ట్ర మహిళా కమిషన్, పలు స్వచ్ఛంద సంస్థలు పేర్కొంటున్నాయి. పెరుగుతున్న కేసులు.. రాష్ట్రంలో గత రెండేళ్లలో ఎన్నారై పెళ్లిళ్లకు సంబంధించి అదనపు వరకట్నం, వేధింపుల కింద 339 కేసులు నమోదైనట్టు పోలీస్ శాఖ లెక్కలు చెబుతున్నాయి. హైదరాబాద్ నగర కమిషనరేట్ పరిధిలోనే 136 కేసులు, సైబరాబాద్లో 76, రాచకొండలో 32, వరంగల్లో 18, కరీంనగర్లో 9, నల్లగొండలో 9, మహబూబ్నగర్లో 12, రంగారెడ్డిలో 9, ఖమ్మంలో 18, ఆదిలాబాద్లో 8, నిజామాబాద్లో 12 కేసులు నమోదయ్యాయి. ఇలా ఐదేళ్ల నుంచి రాష్ట్రవ్యాప్తంగా సీఐడీ, వివిధ పోలీస్స్టేషన్లలో కలిపి మొత్తం 738 కేసులు పెండింగ్లో ఉన్నాయని పోలీస్ శాఖ చెబుతోంది. 60 శాతం 25 ఏళ్ల లోపు వారే.. ఎన్నారై మోసాలకు సంబంధించిన కేసుల్లో 60 శాతం మంది 25 ఏళ్లలోపున్న అమ్మాయిలే బాధితులుగా ఉన్నారు. పెళ్లైనా ఆర్నెల్ల నుంచి ఏడాది లోపే భర్తలు తిప్పి పంపడం, వరకట్నం కోసం వేధింపులు, నచ్చలేదని పంపించేయడంతో వీరంతా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తోంది. అలాగే బాధితుల్లో 17 శాతం మంది 31 నుంచి 35 ఏళ్లలోపు ఉంటుండగా మిగతావారు 36 ఏళ్ల పైబడిన వారని పోలీస్ శాఖ అధ్యయనంలో వెల్లడైంది. చదువుల దశలోనే సంక్షోభం వైపు.. కొందరు తల్లిదండ్రులు గ్రాడ్యుయేషన్ పూర్తవగానే తమ కూతుళ్లకు ఎన్నారై వరుడితో పెళ్లి చేసి పంపేస్తున్నారు. విదేశాలకు వెళ్లిన తర్వాత వారు అక్కడ పీజీ కోర్సుల్లో చేరుతున్నారు. ఇలా అక్కడ చదువుకుంటున్న దశలోనే వెనక్కి వస్తున్న యువతుల సంఖ్య కూడా ఎక్కువే ఉంది. ఎన్నారై కేసుల్లో ఇలాంటివి 38 శాతం దాకా ఉన్నట్టు పోలీస్ లెక్కలు స్పష్టంచేస్తున్నాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ కో–ఆపరేషన్, చైల్డ్ డెవలప్మెంట్ విభాగం చేసిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఇలాంటి వారు అటు చదువు పూర్తి చేయలేక.. ఇటు జరిగిన అన్యాయంపై పోరాటం చేయలేక తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్టు ఆ సర్వేలో తేలింది. ఎన్నారై సంబంధం అనగానే తల్లిదండ్రులు పెళ్లిళ్లకు ఒప్పేసుకోవడం కూడా ప్రధాన సమస్యగా మారింది. దేశవ్యాప్తంగా పలు ఎన్నారై కేసులను పరిశీలించగా అందులో 38 శాతం సంబంధాల్లో మాత్రమే వధువు తల్లిదండ్రులు.. వరుడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకొన్నట్టు స్పష్టమైంది. 22 శాతం పెళ్లి సంబంధాల్లో నామ్కేవాస్తేగా విచారణ జరిపినట్టు సర్వేలో తేలింది. అబ్బాయిల గురించి పూర్తిగా తెలుసుకోకుండానే పెళ్లిళ్లు చేయడం వల్ల కూడా సమస్యలు వచ్చిపడుతున్నట్టు వెల్లడైంది. -
రెండో పెళ్లి తప్పింది.. తొలి పెళ్లి అయ్యింది
తాండూరు (రంగారెడ్డి): భార్య ఉండగానే ఓ ప్రబుద్ధుడు రెండో పెళ్లికి సిద్ధమవటం.. తీరా తాళి కట్టే సమయానికి మొదటి భార్య రావటం.. పెళ్లి ఆగిపోవటం.. ఏం చేయాలో తోచక వేరే వ్యక్తికి వధువునిచ్చి పెళ్లి చేయటం.. చూస్తే ఏదో సినిమా జరిగిన సన్నివేశాన్ని గుర్తు చేస్తుందిగా.. ఈ పెళ్లి. సరిగ్గా ఓ పెళ్లిలో ఇదే జరిగింది. శుక్రవారం తాండూరు పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకున్నది. తాండూరు అర్బన్ సీఐ వెంకట్రామయ్య తెలిపిన వివరాల ప్రకారం.. ఘట్కేసర్ మండలం రాంపల్లికి చెందిన మంజులకు 1989లో వినోద్ అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. రెండేళ్ల తరువాత ఇద్దరూ విడిపోయారు. తరువాత 2004 సంవత్సరంలో లంగర్హౌస్కు చెందిన తన మేనమామ కొడుకు గాజర్ల కిరణ్వర్మను పెళ్లి చేసుకున్నారు. తరువాత సేల్స్ రి్రపజెంటేట్గా పనిచేసే కిరణ్వర్మ, మంజుల ఇద్దరు కొంతకాలం విశాఖపట్నంలో నివసించారు. రెండేళ్ల క్రితం ఇద్దరు హైదరాబాద్కు వచ్చారు. తాజాగా తాండూరు పట్టణానికి చెందిన ఓ అమ్మాయితో తెలిసిన వారి ద్వారా కిరణ్వర్మ పెళ్లి సంబంధం కుదుర్చుకున్నాడు. తనకు ఇదివరకే పెళ్లి జరిగిన విషయాన్ని దాచిపెట్టాడు. శుక్రవారం ఉదయం 11.15 గంటలకు మంచి ముహూర్తం ఉందని, అదే ముహూర్తానికి పెళ్లి చేయాలని ఒత్తిడి తెచ్చాడు. వరకట్నం కింద రూ.లక్ష నగదు, నాలుగు తులాల బంగారం ఇతర కానుకలు మాట్లాడుకున్నారు. వధువు తరఫున కుటుంబ సభ్యులు స్థానిక దేవాలయంలో ఘనంగా పెళ్లి ఏర్పాట్లు చేశారు. తన భర్త రెండో పెళ్లి చేసుకుంటున్న సమాచారం తెలుసుకున్న మంజుల గురువారం రాత్రే కీసర పోలీసుస్టేషన్కు వెళ్లి వివరాలు తెలిపింది. మంజుల తన తండ్రి రాజేశ్వరరావు, సోదరుడు బాల్రాజ్లతో కలిసి తాండూరుకు రాత్రి చేరుకున్నారు. శుక్రవారం ఉదయమే మంజుల పోలీసుస్టేషన్కు వెళ్లి తన భర్త రెండో పెళ్లి చేసుకుంటున్నాడని, ఆధార్కార్డు, ఫొటోలు తదితర ఆధారాలు పోలీసులకు చూపించింది. పోలీసులు వధువు తరఫు వారికి జరిగిన విషయం తెలపడంతో మొదట షాక్ తిన్నారు. పోలీసులు రంగం ప్రవేశం చేసి, కిరణ్వర్మను అదుపులోకి తీసుకొని పోలీసుస్టేషన్కు తరలించారు. వరుడి తరఫున వచ్చిన కొందరు దగ్గర బంధువులు మినహా అందరూ అక్కడి నుంచి ఫలాయనం చిత్తగించారు. ఈ మేరకు చీటింగ్ కేసు నమోదు చేసి, అరెస్టు చేసినట్టు సీఐ చెప్పారు. అనంతరం రెండో పెళ్లి తప్పిపోవడంతో వధువు కుటుంబ సభ్యులు సంతోషపడ్డారు. కూతురు పెళ్లి ఆగిపోవద్దని భావించి కొన్ని గంటల వ్యవధిలో గతంలో అనుకున్న బంధువుల అబ్బాయికిచ్చి పెళ్లి జరిపించారు. మంజులను పెళ్లి చేసుకోలేదు: కిరణ్వర్మ తన భార్యగా చెప్పుకుంటున్న మంజులను నేను పెళ్లి చేసుకోలేదు. ఆమెతో కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్నాను. సేల్స్ రిప్రజంటేటీవ్గా పని చేస్తూ విశాఖపట్నంలో ఇద్దరు కలిసి నివసించాం. సుమారు రెండేళ్ల క్రితమే హైదరాబాద్కు వచ్చాం.