చెల్లనిచెక్కు కేసుల్లో నిందితులకు జైలు | Sakshi
Sakshi News home page

చెల్లనిచెక్కు కేసుల్లో నిందితులకు జైలు

Published Wed, Oct 15 2014 12:51 AM

Invalid wooden case of the accused in prison

రంగారెడ్డి జిల్లా కోర్టులు: చెల్లని చెక్కు ఇచ్చి మోసం చేసిన కేసులో నిందితునికి ఏడాది జైలుశిక్ష విధించడంతో పాటు రూ.5.90 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశిస్తూ 8వ స్పెషల్ మేజిస్ట్రేట్ మంగళవారం తీర్పు చెప్పారు.  వివరాలు.. కుత్బుల్లాపూర్‌కు చెందిన మధుకర్, సరూర్‌నగర్ క్రాంతినగర్‌కు చెందిన భీంరెడ్డి పరిచయస్తులు. తన వ్యాపార అవసరాల నిమిత్తం భీంరెడ్డి 2013 మార్చి, 15న మధుకర్ నుంచి రూ.5 లక్షలు అప్పుగా తీసుకుని ఆరు నెలల్లోగా తిరిగి చెల్లిస్తానని హామీ ఇచ్చాడు.

గడువు పూర్తయ్యాక డబ్బులు చెల్లించాలని భీంరెడ్డిని కోరగా అతను హెచ్‌డీఎఫ్‌సీ చైతన్యపురి బ్రాంచికి చెందిన రూ.5 లక్షల చెక్కును మధుకర్ పేరిట జారీ చేశాడు. ఆ చెక్కును ఐసీఐసీఐ బ్యాంక్ బాలానగర్ బ్రాంచిలో జమచేయగా ఖాతాలో సరిపడా డబ్బులు లేకపోవడంతో బౌన్స్ అయింది.  నోటీసు పంపినా భీంరెడ్డి డబ్బులు స్పందించకపోవడంతో మధుకర్ కోర్టును ఆశ్రయించాడు. కేసు సాక్ష్యాధారాలను పరిశీలించిన 8వ స్పెషల్ మేజిస్ట్రేట్ పైవిధంగా తీర్పు చెప్పారు.
 
మరో కేసులో...

మరో చెక్ బౌన్స్ కేసులో నిందితునికి ఆరు నెలల జైలుశిక్ష, రూ.8.25 లక్షల నష్టపరిహారం చెల్లించాలని కోర్టు మంగళవారం తీర్పు చెప్పింది. వివరాలు... హస్తినాపురంకు చెందిన విజయేందర్‌రెడ్డి, చింతల్‌కుంట వివేకానందనగర్‌కాలనీకి చెందిన నర్సింగరావులు పరిచయస్తులు.  నర్సింగరావు 2012 ఫిబ్రవరిలో విజయేందర్‌రెడ్డి నుంచి రూ.6.30 లక్షలను అప్పుగా తీసుకొని,  మూడు నెలల్లోగా తిరిగి చెల్లిస్తానని హామీ ఇచ్చాడు.

గడువు ముగిశాక డబ్బులు చెల్లించమని నర్సింగరావును కోరగా హెచ్‌డీఎఫ్‌సీ గడ్డిఅన్నారం బ్రాంచికి చెందిన రూ.6.30 లక్షల చెక్కును విజయేందర్‌రెడ్డి పేరిట జారీ చేశాడు. సదరు చెక్కును తన ఖాతాలో జమచేయగా చెల్లలేదు. నోటీసు పంపినా నర్సింగరావు డబ్బులు చెల్లించకపోవడంతో విజయేందర్‌రెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. కేసు సాక్ష్యాధారాలను పరిశీలించిన 8వ స్పెషల్ మేజిస్ట్రేట్ పైవిధంగా తీర్పు చెప్పారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement