నిధులొచ్చినా.. నిద్రలేవలే | internal roads zones finalized seven months | Sakshi
Sakshi News home page

నిధులొచ్చినా.. నిద్రలేవలే

Dec 3 2015 12:27 AM | Updated on Mar 28 2018 11:26 AM

గ్రామీణ ప్రజలు రోడ్ల నిర్మాణం కోసం ఎదురుచూపు తప్పడంలేదు.

మండలాల్లో అంతర్గతరోడ్లు మంజూరై ఏడు నెలలు
ఇంకా టెండర్లు కూడా పూర్తికాని దుస్థితి
 జిల్లాలో గ్రామీణాభివృద్ధి కోసం రూ.28.69 కోట్లు కేటాయింపు
 నిధుల లేమితోనే  జాప్యమంటున్న అధికారులు

 పరిగి: 
గ్రామీణ ప్రజలు  రోడ్ల నిర్మాణం కోసం ఎదురుచూపు తప్పడంలేదు. ఆర్భాటంగా ఏడు నెలల క్రితం ఏప్రిల్‌లో మంజూరు చేసినప్రభుత్వం ఆ తర్వాత  పనుల ఊసెత్తడం లేదు. 2015-16 సంవత్సరానికి గాను పంచాయతీరాజ్ రూరల్ డెవలప్‌మెంట్ కింద తెలంగాణ ప్రభుత్వం మండలాల్లో అంతర్గత రోడ్లు మంజూరు చేసింది. గ్రామానికి గ్రామానికి మధ్య ఉండే అంతర్గత రోడ్లకు గ్రావెలింగ్ పనులు నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకోసం తొమ్మిది నియోజకవర్గాలకు చెందిన 33 మండలాల్లో మొత్తం రూ.28.69 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వం ఏప్రిల్‌లో ప్రకటించింది. పంచాయతీరాజ్ అధికారులకు వాటి ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ నిధులతో జిల్లాలో 933రోడ్లు, 1269.91 కిలోమీటర్ల మేర గ్రావెలింగ్ పనులు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే రోడ్లు మంజూరు చేసి ఏడు నెలలు దాటినా ఇప్పటికీ టెండర్లు పిలవడం లేదు. అదేమంటే ప్రభుత్వం నిధులు విడుదల చేయనందునే టెండర్లు పిలవడం లేదని పంచాయతీరాజ్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.  

 నియోజకవర్గాల వారీగా..
 జిల్లాలో తొమ్మిది గ్రామీణ నియోజకవర్గాలకు చెందిన 33 మండలాల్లో రోడ్లు నిర్మించనున్నారు. ఇందులో భాగంగా చెవెళ్ల నియోజకవర్గానికి రూ.నాలుగు కోట్లు, ఇబ్రహీంపట్నానికి రూ.మూడు కోట్లు, మహేశ్వరం రూ.నాలుగు కోట్లు, మేడ్చల్‌కు రూ.3.69 కోట్లు, పరిగి నియోజకవర్గానికి రూ.మూడు కోట్లు, కుత్బుల్లాపూర్‌కు రూ.కోటి, రాజేంద్రనగర్‌కు రూ.కోటి, తాండూరుకు రూ.ఐదు కోట్లు, వికారాబాద్‌కు రూ.నాలుగు కోట్ల నిధులు మంజూరు చేశారు. మొత్తం జిల్లాలోని రోడ్లకు రూ.28.69 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

 వ్యవహారం కోర్టుకు చేరినందునే?
 అయితే ఈ గ్రామీణ అంతర్గత రోడ్లు ప్రారంభం కాకపోవటానికి నిధుల లేమి అని అధికారులు పేర్కొంటుండగా కారణం వేరే ఉందని కొందరు అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మంజూరు అయిన ఈ రోడ్లకు సంబంధించి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే కోర్టుకు వెళ్లినందునే ప్రభుత్వం ఈ రోడ్ల ఊసెత్తడం లేదని పేర్కొంటున్నారు. అధికార పార్టీ నాయకులు, కార్యకర్తల పొట్ట నింపడానికే ఈ రోడ్లను మంజూరు చేశారని, వీటిని నిలిపి వేయాలని పేర్కొంటూ కోర్టులో వ్యాజ్యం వేసినందునే రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కూడా ఈ రోడ్లు ప్రార ంభించేందుకు  ప్రభుత్వం వెనకాడుతుందని ఓ అధికారి తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement