100 విమానాలు; సెంచరీ కొట్టేశారు! | Increased Flight Travels After LockDown Easing | Sakshi
Sakshi News home page

సెంచరీ కొట్టేశారు!

Jun 11 2020 8:43 AM | Updated on Jun 11 2020 9:18 AM

Increased Flight Travels After LockDown Easing - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ సడలింపుల అనంతరం ప్రారంభమైన దేశీయ విమానాల రాకపోకలు క్రమంగా మెరుగుపడుతున్నాయి. ప్రయాణికులు విమాన సేవలను సది్వనియోగం చేసుకుంటున్నారు. మొదట్లో ఒకటి, రెండ్రోజుల పాటు ప్రయాణికులు లేకపోవడంతో పలు నగరాలకు సర్వీసులు రద్దయ్యాయి. మరోవైపు ముంబై, చెన్నై, తదితర నగరాలకు సైతం అక్కడి ప్రభుత్వాలు అనుమతించకపోవడం వల్ల కూడా ఫ్లైట్లు రద్దయ్యాయి. కానీ ప్రస్తుతం దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు హైదరాబాద్‌ నుంచి విమాన సర్వీసులు ఎలాంటి ఆటంకం లేకుండా నడుస్తున్నట్లు ఎయిర్‌పోర్టు వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఢిల్లీ, ముంబై, పుణే, చెన్నై, కోల్‌కతా, విజయవాడ, వైజాగ్, కడప, త్రివేండ్రం, కొచ్చిన్, బెంగళూరు, భోపాల్, లక్నో.. తదితర 70 నగరాలకు 100 విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. (కరోనా: జూలై నెలాఖరుకు పరిస్థితి తీవ్రం)

దేశీయ విమాన సర్వీసులను పునరుద్ధరించినప్పటి నుంచి ఇప్పటివరకు సుమారు 55 వేల మందికి పైగా హైదరాబాద్‌ నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించినట్లు అంచనా. మే 25 నుంచి 31 వరకు వారం రోజుల్లోనే సుమారు 28,251 మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు ప్రయాణం చేశారు. జూన్‌ ఒకటో తేదీ నుంచి ఇప్పటివరకు మరో 28 వేల మందికి పైగా ప్రయాణం చేసినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. సాధారణ రోజుల్లో హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సుమారు 550కి పైగా జాతీయ, అంతర్జాతీయ విమానాలు రాకపోకలు సాగిస్తాయి. రోజుకు 65 వేల మందికి పైగా ప్రయాణం చేస్తారు. వారిలో 55 వేల మంది దేశీయ ప్రయాణికులే కావడం గమనార్హం. 

నెమ్మది.. నెమ్మదిగా.. 
కరోనా వ్యాప్తి దృష్ట్యా మొదట్లో ప్రయాణికులు విమానాల్లో రాకపోకలు సాగించేందుకు వెనుకడుగు వేశారు. ముఖ్యంగా మొదటి మూడ్రోజులు ప్రయాణికులు లేకపోవడంతో పలు విమానాలు రద్దయ్యాయి. కానీ ఆ తర్వాత నెమ్మదిగా సర్వీసులు పెరిగాయి. 2 నెలల లాక్‌డౌన్‌ తర్వాత మే 25న మొదటి రోజు 20 విమానాలు హైదరాబాద్‌ నుంచి వివిధ ప్రాంతాలకు బయలుదేరగా, 19 విమానాలు నగరానికి చేరుకున్నాయి. సుమారు 3 వేల మంది ప్రయాణం చేశారు. హైదరాబాద్‌ నుంచి కర్ణాటకలోని విద్యానగర్‌కు బయలుదేరిన మొదటి ట్రూజెట్‌ విమానంలో కేవలం 12 మంది బయలుదేరటం విశేషం. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వచి్చన ఎయిర్‌ ఏసియా విమానంలో 106 మంది ప్రయాణికులు నగరానికి చేరుకున్నారు. మొదటిరోజు పలు సరీ్వసులు ఆకస్మికంగా రద్దు కావడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. రెండోరోజు 2,500 మంది రాకపోకలు సాగించారు. మూడోరోజు 3,500 మంది ప్రయాణం చేశారు. 41 విమానాలు వివిధ నగరాలకు రాకపోకలు సాగించాయి. ఆ తర్వాత క్రమంగా విమాన సర్వీసుల సంఖ్య పెరిగింది. ఇండిగో, స్పైస్‌జెట్, గోఎయిర్, ఎయిర్‌ ఇండియా, ట్రూజెట్, తదితర ఎయిర్‌లైన్స్‌ సంస్థలు కేంద్ర విమానయాన సంస్థ ఆదేశాలకు అనుగుణంగా పరిమిత సంఖ్యలో విమానాలను నడుపుతున్నాయి. అన్ని మెట్రో నగరాలతో పాటు సూరత్, అహ్మదాబాద్, రాంచీ, బెల్గాం, రాయ్‌పూర్, కొల్హాపూర్, వారణాసి తదితర అన్ని నగరాలకు విమాన సేవలు అందుబాటులోకి వచ్చాయి.

పటిష్టంగా కోవిడ్‌ నిబంధనలు
ప్రయాణికులు, విమానాశ్రయ సిబ్బంది, అధికారుల మధ్య భౌతిక దూరం పాటించటంతో పాటు, విమానాల్లోనూ పరిమిత సంఖ్యలోనే ప్రయాణికులను అనుమతిస్తున్నారు. థర్మల్‌ స్క్రీనింగ్‌తో పాటు, ప్రయాణికులకు ఫేస్‌ మాస్క్‌లు, శానిటైజర్లు అందజేస్తున్నారు. ప్రతిరోజు విమానాశ్రయాన్ని శానిటైజ్‌ చేయడంతో పాటు వైరస్‌ నిర్మూలనకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు వివిధ ప్రాంతాల నుంచి నగరానికి చేరుకున్న వారికి కరోనా నిబంధనలకు అనుగుణంగా 14 రోజుల పాటు ఇంట్లోనే హోంక్వారెంటైన్‌ పాటించాలని సూచిస్తున్నారు. మరోవైపు ‘ప్యాసింజర్‌ ఈజ్‌ ప్రైమ్‌’సేవల్లో భాగంగా విమానాశ్రయానికి రాకపోకలు సాగించే అన్ని క్యాబ్‌లను కూడా శానిటైజ్‌ చేస్తున్నారు. డ్రైవర్లకూ థర్మల్‌ స్క్రీనింగ్‌ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement