ఒక్క స్లాట్‌లోనే 53 మందికి ప్లేస్‌మెంట్స్‌  | IIT campus recruitment ongoing in Hyderabad | Sakshi
Sakshi News home page

ఒక్క స్లాట్‌లోనే 53 మందికి ప్లేస్‌మెంట్స్‌ 

Dec 2 2019 3:06 AM | Updated on Dec 2 2019 3:06 AM

IIT campus recruitment ongoing in Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఐఐటీ హైదరాబాద్‌లో మొదటి విడత క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లో విద్యార్థులు సత్తా చాటుతున్నారు. మొదటిరోజు ఒక్క స్లాట్‌లోనే 53 మంది విద్యార్థులకు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ లభించాయి. 2019–20 విద్యా సంవత్సరానికి గానూ ఐఐటీ హైదరాబాద్‌లో ఆదివారం ఉదయం 7 గంటలకు తొలి విడతలో మొదటి స్లాట్‌ క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం 3 గంటల వరకు అవి పూర్తయ్యాయి. ఆ తర్వాత చేపట్టిన మరో రెండు స్లాట్లలో ప్లేస్‌మెంట్స్‌ సెలెక్షన్‌ ఆదివారం రాత్రి 12 గంటల వరకు కొనసాగాయి.  

పాల్గొన్న 15 కంపెనీలు: తొలి స్లాట్‌లో మొత్తం 15 కంపెనీలు పాల్గొనగా అందులో టీఎస్‌ఎంసీ, ఎస్‌ఎంఎస్, డేటాటెక్‌ అండ్‌ ఎన్‌టీటీ–ఏటీ సంస్థ లు ఆరుగురు విద్యార్థులకు విదేశాల్లో ప్లేస్‌మెంట్స్‌ ఇచ్చాయి. బుక్‌మైషో, స్ప్రింక్లర్, జాగ్వార్, బజాజ్‌ ఆటో, బెన్‌వై మెల్లన్, డామినో డాటా ల్యాబ్స్, కాగోపోర్ట్‌ వంటి కంపెనీలు ప్లేస్‌మెంట్స్‌లో తొలి సారి పాల్గొనడం విశేషం. మైక్రోసాఫ్ట్, గోల్డ్‌మ్యాన్‌ సాక్స్, సేల్స్‌ఫోర్స్, ఇంటెల్, క్వాల్‌కామ్, ఒరాకిల్‌ వంటి సంస్థలు ఐఐటీహెచ్‌కు వచ్చాయి. అందులో అత్యధికంగా మైక్రోసాఫ్ట్‌ 17 మందికి ఆఫర్లను ఇచ్చిందని, వారిలో ఐదుగురు అమ్మాయిలున్నట్లు ఐఐటీ ప్లేస్‌మెంట్స్‌ ఇన్‌చార్జి ప్రదీప్‌ తెలిపారు. ఇక గోల్డ్‌ మ్యాన్‌ సాక్స్‌ ముగ్గురు విద్యార్థులకు ఆఫర్‌ ఇవ్వగా అందులో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. 

రిజిస్టర్‌ చేసుకున్న 477 మంది విద్యార్థులు 
గతేడాది తొలిరోజు 3 స్లాట్లలో చేపట్టిన ప్లేస్‌మెంట్స్‌లో 56 మందికే ఉద్యోగాలు లభించగా, ఈసారి తొలిరోజు ఫస్ట్‌ స్లాట్‌లోనే 53 మందికి క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ వచ్చాయి. తొలివిడత క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ ఈనెల 12 వరకు కొనసాగనుండగా, రెండో విడత క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ వచ్చే జనవరి నుంచి ఏప్రిల్‌ మధ్య నిర్వహించనుంది. ఈ ఏడాది మొదటి విడత క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ కోసం 477 మంది రిజిస్టర్‌ చేసుకోగా, 224 కంపెనీలు విద్యార్థులకు అవకాశం ఇచ్చేందుకు ముందుకువచ్చాయి. అదే గతేడాది మొదటి విడతలో విద్యార్థులకు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ కల్పించేందుకు మొత్తంగా 150 కంపెనీలే వచ్చాయి.  

Advertisement
 
Advertisement
Advertisement