
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల 15 నుంచి 19 వరకు హైదరాబాద్లో జరిగే ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణకు కమిటీలు ఏర్పాటు చేసి పనులు చేపట్టాలని ప్రభుత్వ సీఎస్ ఎస్పీ సింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో మహాసభల నిర్వహణపై సీఎస్ సమీక్ష సమావే శం నిర్వహించారు. వివిధ అంశాలకు సంబంధించి సబ్ కమిటీలు ఏర్పాటు చేసి వారికి తగు బాధ్యతలు, నిధులు అప్పగించి నిర్వహణ కమిటీతో సమన్వయం చేసుకోవాలన్నారు. వేదికల వద్ద ఏర్పాట్లు, భోజన వసతి, అలంకరణ అంశాలపై సమీక్షించారు.
పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల నుంచి పాల్గొనే అధ్యాపకులకు ఆన్ డ్యూటీ సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని కోరారు. పాఠశాల, కళాశాల, వర్సిటీ విద్యార్థులకు మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించాలన్నారు. సాహిత్యానికి సంబంధించి పలు చర్యలు తీసుకుంటున్నట్లు సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి పేర్కొన్నారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు ఎ.శ్రీధర్, రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు డి.ప్రభాకర్రావు, వివిధ శాఖల ఉన్నాతాధికారులు తదితరులు పాల్గొన్నారు.