‘తెలుగు’కు విస్తృత ప్రాచుర్యం | World Telugu Conference In Amalapuram | Sakshi
Sakshi News home page

‘తెలుగు’కు విస్తృత ప్రాచుర్యం

Mar 2 2026 5:59 AM | Updated on Mar 2 2026 5:59 AM

World Telugu Conference In Amalapuram

తెలుగు మహాసభల్లో మాట్లాడుతున్న ఏపీ గవర్నర్‌ ,జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్, తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ

ఆంధ్రా, తెలంగాణ గవర్నర్లు జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్, జిష్ణుదేవ్‌ వర్మ 

అమలాపురంలో అట్టహాసంగా ముగిసిన ప్రపంచ తెలుగు మహాసభలు 

పాల్గొన్న హైకోర్టు సీనియర్‌ న్యాయమూర్తులు

సాక్షి, అమలాపురం : ‘తెలుగు భాషకు విస్తృత ప్రాచుర్యం కల్పించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. తెలుగు భాషను, తెలుగు సంస్కృతీ, సంప్రదాయాలను మనం సంపూర్ణ జీవన విధానంగా మార్చుకున్నప్పుడే ఈ భాష కలకాలం మనుగడలో ఉంటుంది’.. అని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్లు జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్, జిష్ణుదేవ్‌ వర్మ అన్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలోని కిమ్స్‌ మెడికల్‌ కళాశాల ప్రాంగణంలో జరుగుతున్న మూడో ప్రపంచ తెలుగు మహాసభలు రెండో రోజైన ఆదివారం ముగిశాయి.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్లు మాట్లాడుతూ.. తెలుగు భాష ఔన్నత్యాన్ని, అతి ప్రాచీనమైన ఈ భాషకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న గుర్తింపును సభికులకు వివరించారు. ఏపీ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ మాట్లాడుతూ.. సుదీర్ఘ చరిత్రను, మహోన్నత సాహిత్య సంపదను, అద్భుత సాంస్కృతిక వైభవాన్ని కలిగిన తెలుగు భాష మన ఆత్మగౌరవానికి ప్రతీకని కీర్తించారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని ప్రకటించిన గవర్నర్, సభికుల హర్షధ్వానాల మధ్య వేమన శతకంలోని ‘ఉప్పు కప్పురంబు ఒక్క పోలికనుండు’ పద్యాన్ని చదివి వినిపించారు.

వ్యావహారిక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు తెలుగు భాషా వికాసంలో మహత్తర పాత్ర పోషించిన భాషావేత్త, సంస్కర్త అని కొనియాడారు. నేటి ఆధునిక యుగంలో తెలుగు భాష ప్రాచుర్యం పొందుతూనే ఉందని, అయితే దీనిని మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ మాట్లాడుతూ.. తెలుగు మహాసభల ద్వారా తెలుగు సంస్కృతీ సంప్రదాయాలతో పాటు తెలుగు భాషోద్ధరణకు వీలు కలుగుతుందని చెప్పారు. మాతృభాష మీద పట్టు సాధించినప్పుడే ఇతర భాషలపై కూడా సంపూర్ణ అవగాహన కలుగుతుందన్నారు. 

ప్రాచీన భాషగా తెలుగుకు ప్రత్యేక గుర్తింపు.. 
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ గౌస్‌ మీరా మొహి­యుద్దీన్, జస్టిస్‌ సుద్దాల చలపతిరావు, జస్టిస్‌ వాకిటి రామకృష్ణారెడ్డి, జస్టిస్‌ గాడి ప్రవీణ్‌కుమార్‌లు కుటుంబ సమేతంగా ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు మాట్లాడుతూ.. అమ్మభాష తెలుగును మరువకూడదన్నారు. పిల్లలకు చిన్ననాటి నుంచీ తెలు­గు భాష తప్పనిసరిగా నేరి్పంచాలని సూచించారు. దేశ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడాలంటే ప్రాంతీయ భాషలకు గుర్తింపు తప్పనిసరని, ప్రాచీన భాషగా తెలుగుకు దేశంలో తనకుంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉందని చెప్పారు. డీఆర్‌డీఓ మాజీ చైర్మన్‌ సతీష్ రెడ్డి, ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్‌పీ పటా్నయక్, సినీ దర్శకుడు, రచయిత తనికెళ్ల భరణి, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement