అతివేగమే కొంపముంచింది | High-speed kompamuncindi | Sakshi
Sakshi News home page

అతివేగమే కొంపముంచింది

Mar 17 2015 4:01 AM | Updated on Apr 3 2019 7:53 PM

అతివేగమే వారి కొంపముంచింది. స్పీడ్ దాటొద్దని చేసిన హెచ్చరికలు వినకపోవడమే వారికి శాపమైంది. సోమవారం జిల్లాలో జరిగిన మూడు వేర్వేరుప్రమాదాల్లో ఒకరు దుర్మరణం పాలయ్యారు.

అడ్డాకుల: అతివేగమే వారి కొంపముంచింది. స్పీడ్ దాటొద్దని చేసిన హెచ్చరికలు వినకపోవడమే వారికి శాపమైంది. సోమవారం జిల్లాలో జరిగిన మూడు వేర్వేరుప్రమాదాల్లో ఒకరు దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులు, పోలీసుల కథనం మేరకు.. హైదరాబాద్‌లోని చంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన మజీద్(40), మీర్‌జహూర్ అలీ, మహ్మద్ హమీద్ స్నేహితుడి క్వాలీస్ వాహనంలో డ్రైవర్ కార్తీక్‌తో కలిసి జిల్లాలోని ఎర్రవల్లి ప్రాంతంలో భూములను చూసేందుకు బయలుదేరి వెళ్లారు.

వీరు ప్రయాణిస్తున్న క్వాలీస్ వెనక టైరు జానంపేట పాత పెట్రోల్‌బంకు సమీపంలోకి రాగానే పగిలిపోయింది. దీంతో వేగంగా వెళ్తున్న వాహనం బోల్తాపడి పల్టీలు కొడుతూ రోడ్డు కిందకు దూసుకెళ్లింది. దీంతో కారులో ఉన్న మజీద్ అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు. మిగతా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న స్థానికులు క్షతగాత్రులను అంబులెన్స్‌లో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అడ్డాకుల ఎస్‌ఐ ముత్తినేని వెంకటేశ్వర్లు మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల నుంచి వివరాలు సేకరించి.. కేసు దర్యాప్తు చే స్తున్నారు.
 
లారీ ఢీకొనడంతో ఇద్దరికి గాయాలు
 కొత్తకోట: జాతీయ రహదారిపై ఎదురుగా వస్తున్న కారును ఓ లారీ ఢీకొట్టడంతో ఇద్దరుతీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన కొత్తకోటలోని బైపాస్ సమీపంలో చోటుచేసుకుంది. కొత్తకోట బైపాస్‌లో ఇటీవల రోడ్డు పనులు జరుగుతుండటంతో వన్ వేలో వాహనాలను మళ్లిస్తున్నారు. దీంతో తిరుపతి నుంచి మెదక్ జిల్లా జహీరాబాద్ వెళ్లున్న కారును హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జహీరాబాద్‌కు చెందిన నరేష్, ప్రశాంత్ తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను చికిత్సకోసం వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు.
 
ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన డీసీఎం
 కొత్తకోట: ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ఓ డీసీఎం వాహనం ఢీకొట్టింది. ఈ సంఘటన జాతీయ రహదారిపై కనిమెట్ట వద్ద చోటుచేసుకుంది. మహబూబ్‌నగర్ నుంచి కొత్తకోటకు వస్తున్న ఆర్టీసీ బస్సు ప్రయాణికులను దింపేందుకు కనిమెట్ట వద్ద ఆగింది. దీంతో వెనుక వచ్చిన డీసీఎం ఆగిఉన్న బస్సును ఢీకొట్టి బోల్తాపడింది. కాగా, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement