 
													సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. గురువారం ఈ అంశంపై హైకోర్టులో విచారణ జరగగా, ప్రభుత్వం తరపున అడిషనల్ అడ్వొకేట్ జనరల్ రాంచందర్ రావు వాదనలు వినిపించారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం వార్డుల విభజన, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేశామని ఆయన కోర్టుకు విన్నవించారు. పిటిషనర్ తన వాదనలు వినిపిస్తూ ప్రభుత్వం చెప్తున్న వాదనలు పూర్తిగా అవాస్తవమని, ఓటర్ల జాబితా, వార్డుల విభజన సక్రమంగా జరగలేదని తెలిపారు. ఇప్పటివరకు 75 మున్సిపాలిటీలపై హైకోర్టు స్టే విధించిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు స్టే ఉన్న మున్సిపాలిటీలను పక్కనపెట్టి మిగిలిన వాటికి ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని ఎలక్షన్ కమిషన్ కోర్టుకు తెలిపింది. అయితే, ఈ కేసులన్నీ తేలిన తర్వాతే ఎన్నికలు జరపాలని పిటిషనర్ కోర్టుకు తెలపడంతో కోర్టు ఈ పిటిషన్పై మరోసారి వాదనలు వింటామని విచారణను రేపటికి వాయిదా వేసింది.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
