పీజీ మెడికల్‌ సీట్ల అప్పగింతకు బ్రేక్‌  | High Court Interim Order About PG Medical College Seats | Sakshi
Sakshi News home page

పీజీ మెడికల్‌ సీట్ల అప్పగింతకు బ్రేక్‌ 

May 9 2020 4:00 AM | Updated on May 9 2020 4:00 AM

High Court Interim Order About PG Medical College Seats - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వైద్య విద్యలో రెండేళ్ల పీజీ డిప్లొమో సీట్లను అప్పగించి మూడేళ్ల పీజీ సీట్లను పొందేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. 2020–21 విద్యా సంవత్సరంలో ఆ విధంగా అమలు చేయరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎంసీఏ, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని డాక్టర్‌ పి.భావన సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు, జస్టిస్‌ టి.అమర్‌నాథ్‌గౌడ్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని ఆరు ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు, ప్రభుత్వ కాలేజీల్లోని 18 పీజీ డిప్లొమో సీట్లను ప్రభుత్వానికి అప్పగించి మెడికల్‌ సీట్లు పొందాయని, వీటిని నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు కామినేని, కాకతీయ, ఎంఎన్‌ఆర్, ప్రతిమ, గాంధీ మెడికల్‌ కాలేజీలకు నోటీసులు జారీ చేసింది. విచారణను వచ్చే నెల 1కి వాయిదా వేసింది. గ్రామీణ ప్రాంత ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేసే 50 శాతం వారికి ఉన్న రిజర్వేషన్ల అవకాశాలు దెబ్బతింటాయని, పిటిషనర్‌ కూడా నష్టపోయారని ఆమె న్యాయవాది వాదించారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించే వారు రెండేళ్ల పీజీ డిప్లమోతో తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారనే విషయాన్ని ఎంసీఏ, ప్రభుత్వం పట్టించుకోలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. కరోనా వేళ వైద్య విద్యను వృద్ధి చేయాలని, నైపుణ్యతను పెంచాలని ప్రభుత్వం భావించి ఉంటే ఈ నిర్ణయం తీసుకుని ఉండేది కాదని, ఇది ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలకు మేలు జరిగేలా ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement