
సాక్షి, హైదరాబాద్: సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తికి ఈ నెల 20వ తేదీ సాయంత్రం 6 గంటలకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఆయన మిత్రులు, పాత్రికేయ సహచరులు ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఆయన 70వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు సీనియర్ పాత్రికేయులు మల్లేపల్లి లక్ష్మయ్య, ఎమెస్కో విజయ్కుమార్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా ‘యాభై ఏళ్ల భారతీయ జర్నలిజం’అనే అంశంపై ఢిల్లీకి చెందిన సీనియర్ పాత్రికేయులు ఎస్. వెంకట నారాయణ కీలకోపన్యాసం చేయనున్నారు. ఈ సమావేశంలో డాక్టర్ రామచంద్రమూర్తి మిత్రులు, సన్నిహితులు, రాజకీయ, సామాజిక, మీడియా, సాంస్కృతిక రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొననున్నట్లు తెలిపారు.