కదిలిస్తే కన్నీటి వరదే.. | Sakshi
Sakshi News home page

కదిలిస్తే కన్నీటి వరదే..

Published Wed, Sep 5 2018 8:14 AM

Gokul Chat Blasts Families Want to justice - Sakshi

ఉప్పల్‌: లుంబిని పార్కు, గోకుల్‌ చాట్‌ దుర్ఘటన జరిగి 11 ఏళ్లు గడిచినా వారి కుటుంబ సభ్యులు నేటికీ ఆ పేరు గుర్తు చేస్తే ఉల్లిక్కి పడుతున్నారు. ఎవరిని కదలించినా కన్నీటి పర్యంతమవుతున్నారు. ఉప్పల్‌ శాంతినగర్‌కు చెందిన గాదే అంజయ్య, వెంకటలక్ష్మిల కూతురు స్రవంతి(14), చిన్నమ్మ సుశీల(30), అంజయ్య అన్న కూతురు శ్రీలేఖ(19)తో కలసి రాఖీ పౌర్ణమి సందర్భంగా రాఖీలు కొనేందుకు వెళ్లి షాపింగ్‌ అనంతరం గోకుల్‌ చాట్‌కు వెళ్లారు. వారు లోపల ఉండగానే బాబు పేలింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన సుశీల(30), శ్రీలేఖ(19), స్రవంతి(14) ప్రాణాలు కోల్పోయారు. ఆ రోజు నుంచి రాఖీ పౌర్ణమి వచ్చిందంటే వారు భయపడుతున్నారు. 

ఆలస్యమైనా కఠినశిక్ష పడాల్సిందే..
‘ఆలస్యమైనా తప్పుచేసిన నిందితులకు మాత్రం కఠిన శిక్షపడితేనే మరణించిన వారి అత్మలకు శాంతి కలుగుతుంది. గత 11 సంవత్సరాలుగా  నిందితులకు రాజభోగాలు అందించడం చూసి బాధేసింది. వారికోసం రూ. కోట్లు ఖర్చు చేసారు. మాకు మాత్రం పరిహారం ఇచ్చి చేతులు దులుపుకున్నారు. మృతుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తానన్న మాటను ప్రభుత్వం దాటవేసింది. నింధితులను కోర్టుకు తీసుకు వచ్చినప్పుడల్లా రాజులా సెక్యూరిటీ మధ్యలో తీసుకువస్తుంటే బాధ పడ్డాం. బాధితులకు సత్వర న్యాయం జరగాలి. అయినా పర్వాలేదు.. బాద్యులందరినీ ఉరికంభం ఎక్కించాల్సిందే’ అని మృతురాలు స్రవంతి తండ్రి అంజయ్య డిమాండ్‌ చేశారు. 

ఆగస్టు అంటే భయమేస్తుంది..
‘రాఖీ పండగ అంటే మా కుటుంబంలో భయంతో కూడిన విషాదం కనబడుతుంది. నేరాలు చేసినవారు రాజాలా బతుకుతున్నారు. మృతిచెందిన వారి కుటుంబాలే వారి జ్ఞాపకాలతో రోదిస్తున్నాయి. నిందితులకు అప్పటికప్పుడే శిక్ష వేయ్యాలే తప్పా 11 ఏళ్లుగా కేసులను నానబెట్టారు. ఏం సాదించింది.. కేవలం ఇద్దరికే శిక్ష ఖరా>రు చేసింది. విచారణ పేరుతో బాధితులను మభ్యపెడుతున్నారు. చాలా బాధగా ఉంది’ అని గోకుల్‌ చాట్‌ ఘటనలో మృతిచెందిన సుశీల సోదరి చంద్రకళ ఆవేదన చెందింది. ఇప్పటికీ సుశీల కుమారుడు సాయికుమార్‌ నిద్రలో భయంతో కలవరిస్తాడని కన్నీటి పర్యంతమైంది. 

Advertisement
Advertisement