ఆ ఆరడుగుల జాగా కోసం..! | for six feet Space | Sakshi
Sakshi News home page

ఆ ఆరడుగుల జాగా కోసం..!

Aug 15 2015 3:54 AM | Updated on Sep 3 2017 7:27 AM

శవాన్ని ఖననం చేసేందుకు స్థలం చూపాలంటూ నగరపంచాయతీ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగిన వైనం నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్‌లో శుక్రవారం జరిగింది.

శవాన్ని ఖననం చేసేందుకు స్థలం చూపించాలని ధర్నా
హుజూర్‌నగర్: శవాన్ని ఖననం చేసేందుకు స్థలం చూపాలంటూ నగరపంచాయతీ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగిన వైనం నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్‌లో శుక్రవారం జరిగింది. పట్టణానికి చెందిన చింతల నాగేశ్వరరావు (35) హమాలీ కార్మికుడు గుండెపోటుతో మృతి చెందాడు. వడ్డెర కులానికి చెందిన నాగేశ్వరరావు అంత్యక్రియలను ఇతర కులాల వాటికలో నిర్వహించడం నిషిద్ధం. అయితే స్థానికంగా ఆ కులస్తులకు సంబంధించి ఎటువంటి శ్మశానవాటిక లేదు. ఇటీవల అదే కులానికి చెందిన ఆర్థికంగా వెసులుబాటు కలిగిన కొన్ని కుటుంబాల వారు కొంత స్థలాన్ని కొనుగోలు చేసి శ్మశానవాటికను ఏర్పాటు చేసుకున్నారు.

నాగేశ్వరరావును ఆ శ్మశానవాటికకు తీసుకెళ్లి ఖననం చేసేందుకు అనుమతి  కోరగా వారు నిరాకరించారు. స్థానిక హిందూశ్మశాన వాటికలోనైనా ఖననం చేద్దామని బంధువులు అక్కడకు వెళ్లగా దహనమే తప్ప ఖననం ఈ స్మశానవాటికలో లేదని వారు సైతం నిరాకరించారు. దీంతో ఏమి చేయాలో దిక్కు తోచక బంధువులు ఆ మృతదేహాంతో స్థానిక నగరపంచాయతీ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. దీంతో ప్రజాప్రతినిధులు పట్టణంలోని అదే కులానికి చెందిన శ్మశానవాటికలో ఖననం చేసే విధంగా మాట్లాడి ఒప్పించి అంత్యక్రియలను పూర్తి చేయించారు.

Advertisement
 
Advertisement
Advertisement