రాజమహేంద్రవరం సిటీ: డీఎస్సీ–2025లో అవకతవకలు, మోసాలపై జూన్ 1న వైఎస్సార్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేయనున్నట్లు వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తెలిపారు. డీఎస్సీపై సీబీఐ, సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేస్తామన్నారు.
డీఎస్సీ నిర్వహణలో ప్రతిభ కలిగిన అర్హులకు అన్యాయం చేయడం, హైకోర్టు ఆదేశాలను లెక్కచేయకుండా ప్రభుత్వం మొండిగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండించారు. డీఎస్సీ నిర్వహణలో పారదర్శకత లోపించడం, విస్తుగొలిపే అక్రమాలు వెలుగు చూడడం, మెరిట్ లిస్టులు వెబ్సైట్ నుంచి మాయం చేయడం, రోల్ ఆఫ్ రిజర్వేషన్ సక్రమంగా పాటించకపోవడం, పోస్టులు అమ్ముకోవడం వంటి ఆరోపణలు బయటికి రావడం, స్పోర్ట్స్ కోటా పోస్టుల నియామకంలో అక్రమాలు వెలుగు చూడడం వంటి అంశాలపై ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ అభ్యర్థులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందన్నారు.


