వంతెన కింద వంతెన | Sakshi
Sakshi News home page

వంతెన కింద వంతెన

Published Thu, May 21 2020 2:43 AM

First level flyover works will be launch by Municipal Minister KTR  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వ్యూహాత్మక రహదారుల పథకం (ఎస్సార్‌డీపీ)లో భాగంగా జీహెచ్‌ఎంసీ చేపట్టిన పనుల్లో మరో ఫ్లైఓవర్‌ పనులు పూర్తయ్యాయి. బయోడైవర్సిటీ జంక్షన్‌ వద్ద సెకండ్‌ లెవెల్‌ ఫ్లైఓవర్‌ ఇప్పటికే అందుబాటులోకి రాగా, ఫస్ట్‌ లెవెల్‌ ఫ్లైఓవర్‌ను మునిసిపల్‌ మంత్రి కేటీఆర్‌ గురువారం ప్రారంభించనున్నారు. ఈ ఫ్లైఓవర్‌తో బయోడైవర్సిటీ జంక్షన్‌ వద్ద ట్రాఫిక్‌ సమస్య తీరనుంది. గచ్చిబౌలి వైపు నుంచి రాయదుర్గం మీదుగా మెహిదీపట్నం వైపు వెళ్లే వారికి దీని వల్ల ట్రాఫిక్‌ చిక్కులు తగ్గుతాయి. దీని వ్యయం రూ.30.26 కోట్లు.  (భయం భయంగా ఆసుపత్రులకు)

ఎస్సార్‌డీపీ ప్యాకేజీ–4 పూర్తి: ఈ ఫ్లైఓవర్‌ పూర్తితో ఎస్సార్‌డీపీలో ప్యాకేజీ–4 కింద మొత్తం రూ.379 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన అన్ని పనులు పూర్తయ్యాయి. ఇప్పటికే మైండ్‌స్పేస్‌ అండర్‌పాస్, మైండ్‌స్పేస్‌ ఫ్లైఓవర్, అయ్యప్ప సొసైటీ జంక్షన్‌ అండర్‌పాస్, రాజీవ్‌గాంధీ జంక్షన్‌ ఫ్లైఓవర్, బయోడైవర్సిటీ జంక్షన్‌ సెకెండ్‌ లెవెల్‌ ఫ్లైఓవర్‌ వినియోగంలోకి వచ్చాయి. దీంతో బయోడైవర్సిటీ జంక్షన్‌ (ఓల్డ్‌ ముంబై హైవే) నుంచి జేఎన్‌టీయూ(ఎన్‌హెచ్‌–65) మార్గంలో ట్రాఫిక్‌ సమస్యలు తగ్గినట్టేనని, మొత్తం 12 కిలోమీటర్ల కారిడార్‌ పనులు పూర్తయ్యాయని మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తెలిపారు. 

Advertisement
Advertisement