సినిమా చూస్తుండగా చెలరేగిన మంటలు | fire accident in cinima hall | Sakshi
Sakshi News home page

సినిమా చూస్తుండగా చెలరేగిన మంటలు

Dec 23 2017 9:01 AM | Updated on Sep 5 2018 9:47 PM

సాక్షి, స్టేషన్‌ఘన్‌పూర్‌: షార్ట్‌ సర్క్యూట్‌తో స్టేషన్‌ఘన్‌పూర్‌ డివిజన్‌ కేంద్రంలోని మహాలక్ష్మీ, లక్ష్మీ థియేటర్‌ కాంప్లెక్స్‌లో శుక్రవారం రాత్రి 9.30 గంటలకు అగ్నిప్రమాదం సంభవించింది. కళ‍్లప‍్పగించి సినిమా సూస‍్తుండగా ఒక‍్కసారిగా మంటలు చెలరేగడంతో గమనించిన ప్రేక్షకులు భయాందోళనకు గురై పరుగులు పెట్టారు. వివరాలిలా ఉన్నాయి. ఘన్‌పూర్‌లోని లక్ష్మీ థియేటర్‌ సాంకేతిక లోపంతో దాదాపు పది రోజుల నుంచి పనిచేయడం లేదు. దీంతో పక్కనే ఉన్నమహాలక్ష్మీ థియేటర్‌ను మాత్రం నడిపిస్తున్నారు. అయితే దీనిలో రెండు రోజుల క్రితం విడుదలైన ఎంసీఏ (మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి) సినిమా నడుస్తోంది. ఇందులో భాగంలో థియేటర్‌లో సినిమా చూసేందుకు సెకండ్‌ షోకు పెద్దసంఖ్యలో ప్రేక్షకులు వచ్చారు. ఈ క్రమంలో సినిమా నడుస్తుండగా మహాలక్ష్మీ థియేటర్‌కు ఆనుకుని ఉన్న లక్ష్మీ థియేటర్‌లో ఒక్కసారిగా అగ్నిప్రమాదం చోటుచేసుకుని పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. గమనించిన థియేటర్‌ సిబ్బంది, ప్రేక్షకులు హాల్‌ నుంచి పరుగెత్తుకుంటూ బయటికి రావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే థియేటర్‌ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు ప్రేక్షకులందరినీ బయటికి పంపించారు. అయితే సినిమా థియేటర్‌లో అగ్ని ప్రమాదం జరిగితే మంటలు ఆర్పే కనీస సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బందికరంగా మారిం దని ప్రేక్షకులు ఆరోపించారు. కాగా, ప్రమాదం జరిగిన గంట సేపటి తర్వాత ఫైర్‌ ఇంజన్‌ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేసే ప్రయత్నం చేశారు. అప్పటికే లక్ష్మీ థియేటర్‌లోని ఫర్నిచర్, పరికరాలు పూర్తిస్థాయిలో దహనమయ్యాయి. అయితే ప్రమాదానికి పూర్తి కారణాలు, నష్టం అం చనాలు తెలియాల్సి ఉంది. సినిమా థియేటర్‌ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు మండిపడ్డారు. ఈ ప్రమాదంలో కేవలం ఆస్థి నష్టమే జరుగగా ప్రేక్షకులకు ఎవరికి ఏమి కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement