‘మిషన్’లో మాయ | Employment funds under the mission of ponds | Sakshi
Sakshi News home page

‘మిషన్’లో మాయ

Apr 26 2015 12:54 AM | Updated on Sep 17 2018 8:02 PM

మిషన్ కాకతీయ పనుల మర్మం అర్థం కావడం లేదు.

- ‘ఉపాధి’ చెరువులకు మిషన్ కింద నిధులు
- కాంట్రాక్టర్లు-అధికారుల కుమ్మక్కు
- గతేడాది చెరువులకే మళ్లీ టెండర్లు
వరంగల్ :
మిషన్ కాకతీయ పనుల మర్మం అర్థం కావడం లేదు. ఎవరి ప్రయోజనాల కోసం పథకం పెట్టారో తెలియకుండా ఉంది. చెరువులను  పునరుద్ధరిస్తున్నామని చెప్పి అధికారులు, కాంట్రాక్టర్లు, ప్రజాప్రతినిధులు జేబులు నింపుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నారుు. ఆయకట్టు లేని చెరువులకు నిధులు కేటారుుంచడం, అనుకూలమైన వారికి టెండర్లు దక్కకపోతే మళ్లీ టెండర్లు నిర్వహించడం, గతంలో నాబార్డ్, ఎన్‌ఆర్‌ఈజీఎస్, ట్రిబుల్‌ఆర్, ప్రపంచ బ్యాంకు నిధులతో చేపట్టిన చెరువులను మళ్లీ మిషన్ కాకతీయ కింద ఎంపిక చేయడం చూస్తే నిధులు దుర్వినియోగం అవుతున్నాయనే విషయం అర్థం అవుతోంది.

అప్పడు చేసిన పనులకు మళ్లీ బిల్లులు చేసేందుకు పక్కా ప్రణాళికలు అధికారులు, కాంట్రాక్టర్లు కలసి రూపొందించుకున్నారు. ముందుగా అధికారులతో అవగాహనకు వచ్చి కాంట్రాక్టు పనులు దక్కించుకున్నారు. తూతూ మంత్రంగా పనులు చేసి గతంలో చేసిన అభివృద్ధి పనులకు మళ్లీ బిల్లులు పొందేందుకు అధికార నేతలు సమాయత్తం అవుతున్నట్లు సమాచారం. కాగా, ఏజెన్సీలోని చెరువుల్లో పూడికతీతలు మొక్కుబడిగా ప్రతిపాదించారు.

మైదాన ప్రాంతాల్లో మంజూరైన నిధుల్లో సగానికి పైగా పూడికతీతలకు కేటాయించగా ఏజెన్సీలోని చెరువులకు కేటాయించిన నిధుల్లో 20 శాతం మించిన దాఖలాలు లేవు. కేవలం గతంలో చేసిన పనులను దృష్టిలో పెట్టుకొని మళ్లీ అవే పనులను మిషన్ కాకతీయలో ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఏజెన్సీలో చెరువుల పునరుద్ధరణ ఏ విధంగా జరుగుతుందో అధికారులు చెప్పకపోవడమే ఇందుకు నిదర్శనం. ఏ చెరువులు చేపట్టారో గోప్యంగా ఉంచుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement