ఓపెన్‌స్కూల్‌ పిలుస్తోంది

ఆగిపోయిన చదువు కొనసాగించే అవకాశం

పది, ఇంటర్‌లో మొదలైన ప్రవేశాలు

తొలిసారిగా ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు అవకాశం 

సాక్షి, ధర్మపురి(కరీంనగర్‌) : వివిధ కారణాలతో చదువుకు దూరమైన వారికి తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం మళ్లీ చదువుకునే అవకాశం కల్పిస్తోంది. ఆర్థిక ఇబ్బందులు, ఇతర కారణాలతో పాఠశాల విద్యను మధ్యలో మానేసిన వారు ఓపెన్‌స్కూల్‌లో చదువుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞానం, వృత్తి విద్యా సంబంధమైన కోర్సులను ప్రవేశపెట్టింది. 14 ఏళ్లు నిండిన వారందరికీ దూరవిద్య ద్వారా పదో తరగతి, ఇంటర్‌ చదువుకునే వెసులుబాటు కల్పించారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లావ్యాప్తంగా 42 ఓపెన్‌ స్కూళ్లు ఉన్నాయి. విద్యపై మక్కువ, ఉన్నత విద్యను అభ్యసించాలనే అభిలాష ఉన్న వారికి ఓపెన్‌ స్కూళ్లు ఒక వరంగా మారాయి. ప్రతినెలా రెండో శనివారం, ప్రతీ ఆదివారం విద్యార్థులకు పాఠాలను బోధిస్తారు. వీటిపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు కృషి చేస్తున్నారు. ఓపెన్‌ స్కూల్‌ ద్వారా ఈనెల31తో గడువు ముగియనుంది. అపరాధ రుసుంతో మాత్రం నవంబర్‌ 10 వరకు అవకాశం ఉంది.  

వయో పరిమితి 
►  పదో తరగతిలో ప్రవేశానికి 2019, ఆగస్టు 31 నాటికి 14 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ట వయోపరిమితి లేదు. 
► ఇంటర్మీడియట్‌ ప్రవేశానికి 2019, ఆగస్టు 31 నాటికి 15 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్ట వయోపరిమతి లేదు. 

బోధనా విషయాలు 
పదో తరగతి, ఇంటర్‌ ఓపెన్‌ స్కూల్‌లో బోధన విషయాలను మూడు గ్రూపులుగా విభజించారు.  
 ► గ్రూపు ఏ భాషలు 
►  గ్రూపు బీ మొయిన్‌ సబ్జెక్టులు 
► (భాషేతర విషయాలు) 
► గ్రూపు సీ వృత్తి విద్యా కోర్సులు 
► అభ్యాసకులే స్వయంగా బోధనా విషయాలు (సబ్జెక్టులను) ఎంపిక చేసుకునే సౌకర్యం ఉంటుంది. మండలంలో నిర్ధేశించిన అధ్యయన కేంద్రాల్లో ఉన్నత పాఠశాలలు/జూనియర్‌ కళాశాలల్లో సంప్రదించాలి. 

బోధనా మార్పులు 
► పదో తరగతిలో తెలుగు, ఆంగ్లం, హిందీ, ఉర్దూ మాద్యమాల్లో ఉంటుంది.ఇంటర్‌లో తెలుగు, ఆంగ్లం, ఉర్దూ, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది.
 
కోర్సుల కాలపరిమతి 
ఓపెన్‌ స్కూల్‌లో నమోదైన విద్యా సంవత్సరం చివరిలో (మార్చి/ఏప్రిల్‌) పబ్లిక్‌ పరీక్షలు నిర్వహిస్తారు. ఇంటర్‌ అన్ని పరీక్షలు (5 లేక 6 సబ్జెక్టులు) రాసేందుకు పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన నాటి నుంచి ఇంటర్‌ తుది పరీక్షకు కనీసం రెండేళ్లు అంతరం ఉండాలి. 

ప్రవేశ రుసుం  
పదో తరగతికి రిజిస్ట్రేషన్‌ ఫీజు: రూ.100 (అందరికీ) 
అడ్మిషన్‌ ఫీజు: జనరల్‌ కేటగిరీ పురుషులకు రూ.1000 
ఇతరులకు: అంటే మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ పిల్లలకు, దివ్యాంగులకు  రూ.600.  

ఇంటర్మీడియట్‌   
రిజిస్ట్రేషన్‌ ఫీజు: 200 (అందరికీ) 
అడ్మిషన్‌ ఫీజు: జనరల్‌ కేటగిరీ 
పురుషులకు:  రూ.1,100 
ఇతరులు: అంటే మహిళ లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ పిల్లలకు, 
దివ్యాంగులకు రూ.800. 

పరీక్ష ఫీజు 
పదో తరగతికి: ప్రతీ సబ్జెక్టుకు రూ.100, ప్రాక్టికల్‌ కలిగిన ప్రతీ సబ్జెక్టుకు అదనంగా రూ.50. 
ఇంటర్మీడియట్‌: ప్రతీ సబ్జెక్టుకు రూ.150, ప్రాక్టికల్‌ కలిగిన ప్రతీ సబ్జెక్టుకు రూ.100. 
నోట్‌: (దివ్యాంగులకు మెడికల్‌ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్‌ ఆధారంగా పరీక్ష ఫీజులో రాయితీ ఉంటుంది). 

క్రెడిట్‌ అక్యుమలేషన్‌ 
అభ్యాసకులు ఒకేసారి అన్ని సబ్జెక్టుల్లో హాజరు కావాలనే నిబంధన లేదు. ఒకటి కానీ అంతకంటే ఎక్కువ సబ్జెక్టుల్లో కానీ వారి సౌలభ్యాన్ని బట్టి హాజరు కావచ్చు. నిర్ణీత 5 ఏళ్లలో ఎప్పుడైనా వారు కోర్సులో (పదో తరగతి/ఇంటర్మీడియట్‌) నిర్ధేశించిన సబ్జెక్టులు ఉత్తీర్ణలవుతారో అప్పుడు పాస్‌ సర్టిఫికెట్‌ మార్కుల మెమో ఇస్తారు.  

సద్వినియోగం చేసుకోవాలి 
చదువును మధ్యలో ఆపేసిన వారికి ఓపెన్‌ స్కూల్‌ ద్వారా చదువు కొనసాగించే అవకాశం ఉంది. ఆసక్తి ఉన్న వారు సద్వినియోగం చేసుకోవాలి. చిన్న, చిన్న ఉద్యోగాలు చేస్తున్న వారికి భవిష్యత్‌లో పదోన్నతి పొందేందుకు ఈ సర్టిఫికెట్‌ ఉపయోగపడుతుంది. 
– వెంకటేశ్వర్లు, డీఈవో, జగిత్యాల 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top