ఆర్టీసీ బస్సు బోల్తా | driver negligence is cause of bus accidents | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు బోల్తా

Feb 19 2018 3:25 PM | Updated on Sep 29 2018 5:33 PM

driver negligence is cause of bus accidents - Sakshi

కుంటాల(ముథోల్‌) : నిర్మల్‌ జిల్లా కుంటాల మండలంలోని కల్లూర్‌–కుంటాల రహదారిపై ఆదివారం అదుపుతప్పి ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఘటనలో 11 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. భైంసా డీపోకు చెందిన బస్సు ఉదయం భైంసా నుం చి మహారాష్ట్రలోని అప్పారావు పేట్‌ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీస్‌స్టేషన్‌ సమీపంలోని మూల మలుపు వద్ద అదుపుతప్పి బస్సు బోల్తా పడడంతో అందులో ప్రయాణిస్తున్న భైంసా మండలం మాలేగాంకు చెందిన కాంతబాయి, దౌనెల్లికి చెందిన లక్ష్మి, శోభ, గంగామణి, మల్లెపువ్వుల సాయిరాంగౌడ్, విజయ, ప్రకాశం జిల్లాకు చెందిన చల్లం పళ్లం రాజు, తానాజీ పవార్, సూర్యవంశీ కేర్‌భ, ముత్తవ్వ, అడెల్లు, డ్రైవర్‌ ముంతాజ్‌అలీలకు తీవ్ర గాయాలయ్యాయి.  


తప్పిన ప్రమాదం


బస్సుడ్రైవర్‌ నిర్లక్ష్యం, మూలమలుపు వద్ద ఎలాంటి సూచికబోర్డులు ఏర్పాటు చేయని కారణంగా బస్సు బోల్తా పడిందని పలువురు పేర్కొంటున్నారు. ఇటీవల కలూర్‌–కుంటాల డబుల్‌రోడ్డు  పనులను నిర్మించగా సూచికబోర్డులు ఏర్పాటు చేయడం మరిచారు. కాగా బోల్తా పడిన బస్సుకు చెట్లు అడ్డంకిగా ఉండడంతో పెను ప్రమాదం తప్పింది.  గాయపడిన క్షతగాత్రులను  108లో భైంసా ఆస్పత్రికి తరలించారు.  కేసు నమోదు చేసినట్లు ఎస్సై యూనిస్‌అహ్మద్‌ అలీ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement