ఆ భూమి రూపురేఖలు మార్చొద్దు | Do not change the shape of the land : High Court | Sakshi
Sakshi News home page

ఆ భూమి రూపురేఖలు మార్చొద్దు

Nov 4 2017 1:24 AM | Updated on Aug 31 2018 8:34 PM

Do not change the shape of the land : High Court - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ నిర్మాణం కోసం లీజుకిచ్చిన విక్టోరియా మోమోరియల్‌ హోం రెసిడెన్షియల్‌ స్కూల్‌ సంబంధిత భూమి రూపు రేఖలు మార్చొద్దని తెలంగాణ ప్రభుత్వాన్ని ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. ఆ భూమిలో చదును చేయడం, చెట్లు కొట్టేయడం చేయొద్దని స్పష్టం చేసింది. తదుపరి విచారణ వరకు ఎలాంటి చర్యలు తీసుకోబోమని అదనపు ఏజీ (ఏఏజీ) హామీ ఇవ్వడంతో దాన్ని నమోదు చేసుకుని విచారణను ఈ నెల 7కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

విక్టోరియా మెమోరియల్‌కు చెందిన 10 ఎకరాల భూమిని రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ నిర్మాణం కోసం లీజుకిస్తూ ప్రభుత్వం జీవోలు జారీ చేయగా, వాటిని సవాల్‌ చేస్తూ విక్టోరియా మెమోరియల్‌ హోం అనాథ పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు ఎల్‌. బుచ్చిరెడ్డి హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. వ్యాజ్యంపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన ధర్మాసనం.. శుక్రవారం మరోసారి విచారించింది. ఏఏజీ వాదనలు వినిపిస్తూ.. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్‌ సిద్ధం చేశామని, విచారణను సోమవారానికి వాయిదా వేయాలని కోరారు. ఇందుకు పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి అభ్యంతరం తెలిపారు. లీజుకు తీసుకున్న భూమిలోని చెట్లను కొట్టేస్తున్నారంటూ  నరికివేతకు సంబంధించిన ఫొటోలను ధర్మాçసనం ముందుంచారు.

లీజుకిచ్చిన భూమి దేవాదాయ శాఖ పరిధిలోకి వస్తుందని, ఆ భూమిపై ప్రభుత్వానికి హక్కుం డదన్నారు. ఫొటోలను పరిశీలించిన ధర్మాసనం.. చెట్లు ఎందుకు నరికేస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రామ చంద్రరావు బదులిస్తూ, లీజుకిచ్చిన భూమి దేవాదాయ భూమేనని అంగీకరించారు. లీజు ఒప్పందం చేసుకోవడా నికి దేవాదాయ శాఖ అనుమతిచ్చిందని, ఒప్పందం చేసుకునే హక్కు ప్రభుత్వానికి ఉందన్నారు. 69 ఎకరాల్లో కమిషనరేట్‌ను నిర్మించనున్నామని వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement