అరెస్టు చేయకుంటే పింఛన్లు పంచం | Sakshi
Sakshi News home page

అరెస్టు చేయకుంటే పింఛన్లు పంచం

Published Tue, Dec 9 2014 4:33 AM

distrubtion of Pensions are not arrested

జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్) : నవాబ్‌పేట్ మండలం కారూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులుపై దాడికి పాల్పడ్డ వారిని వెంటనే అరెస్టు చేయకపోతే ఈనెల 10వ తేదీ నుంచి ప్రభుత్వం తలపెట్టిన పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి సహకరించబోమని పంచాయతీ కార్యదర్శులు హెచ్చరించారు.  

పంచాయతీ కార్యదర్శిపై దాడికి నిరసనగా సంఘం ఆధ్వర్యంలో స్థానిక తెలంగాణ చౌరస్తాలో చేపట్టిన  ధర్నా సోమవారం నాలుగో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా కార్యదర్శులు పెద్దసంఖ్యలో పోలీసు రక్షణ కల్పిస్తేనే పింఛన్ల పంపిణీ చేపడతామన్నారు. కార్యదర్శిపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయూలన్నారు. శ్రీనివాస్‌పై బనాయించిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసును ఉపసంహరించాలన్నారు.  భవిష్యత్తులో ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా చూడాల్సిన భాద్యత అధికారులపై ఉందన్నారు. లేని పక్షంలో ఉద్యమన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.  
 
దాడులను అరికట్టాలి...
ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు చేస్తే విధులు నిర్వహించడం కష్టమని ఎన్‌జీఓ జిల్లా అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి, పంచాయతీ మినిస్ట్రియల్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రావు, రెవెన్యు సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అద్యక్షుడు ప్రభాకర్, ఎంపీడీఓల సంఘం జిల్లా అధ్యక్షుడు గోపాల్‌నాయక్ అన్నారు. సోమవారం వారు ధర్నాకు సంఘీభావం తెలిపారు. పంచాయతీ కార్యదర్శిపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని కోరారు. అనంతరం జిల్లా ఎస్పీ విశ్వ్రపసాద్‌కు  వినతిపత్రం అందజేశారు.
 
ఆందోళన విరమణ
కారూర్ గ్రామపంచాయతీ కార్యదర్శిపై దాడికి నిరసనగా చేపట్టిన ఆందోళనను  విరమిస్తూ మంగళవారం నుంచి జిల్లా వ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శులు విధుల్లో చేరనున్నట్లు సంఘం జిల్లా అధ్యక్షుడు సిటి కేబుల్ శ్రీనివాస్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. దాడి కేసులో నిందితులను అరెస్ చేయడంతో తాము ఆందోళన  విరమిస్తున్నట్లు తెలిపారు.
 

Advertisement
Advertisement