ఉత్తమ సేవలందించిన పలువురు పోలీసులకు రాష్ట్రవ్యాప్తంగా అవార్డులు ప్రకటించారు.
కరీంనగర్ క్రైం, న్యూస్లైన్: ఉత్తమ సేవలందించిన పలువురు పోలీసులకు రాష్ట్రవ్యాప్తంగా అవార్డులు ప్రకటించారు. ఈసారి జిల్లా నుంచి ముఖ్యమంత్రి శౌర్యపతకం, మహోన్నత సేవాపతకంలో స్థానం దక్కింది. రాష్ట్రవ్యాప్తంగా నలుగురికి ముఖ్యమంత్రి శౌర్యపతకం ప్రకటించగా అందులో జిల్లా కేంద్రంలో త్రీటౌన్ సీఐగా పనిచేస్తున్న తోటిచర్ల స్వామి ఎంపికయ్యారు. మహోన్నత సేవాపతకం ముగ్గురికి ప్రకటించగా సిరిసిల్ల డీఎస్పీ దామెర నర్సయ్య ఎంపికయ్యారు.
రాష్ట్ర వ్యాప్తంగా 37 మందికి పోలీస్ కఠిన సేవా పతకం ప్రకటించగా జిల్లాకు చెందిన ఆర్ హెడ్కానిస్టేబుల్ దిగంబర్, కరీంనగర్ సీసీఎస్ ఎస్సై అబ్దుల్ రవూఫ్కు చోటుదక్కింది. 160 మందికి పోలీస్సేవా పతకం ప్రకటించగా జిల్లాకు చెందిన సీసీఎస్ ఎస్సై ప్రభాకర్రెడ్డి, కరీంనగర్ రూరల్ ఏఎస్సై యూసుఫ్ జానీపాషా, గంభీరావుపేట పీఎస్ హెడ్కానిస్టేబుల్ (హెచ్సీ 79) 17వ బెటాలియన్కు చెందిన ఏపీఎస్పీ ఆర్ఐ సీతారాంనాయక్, ఆర్ఎస్సై బి.నాగయ్య, హెడ్కానిస్టేబుల్ ప్రభాకర్, రమేశ్, కరీంనగర్ పీటీసీ నుంచి ఆర్ఎస్సై శంకర్, హెడ్కానిస్టేబుల్ అక్రం అలీ(హెచ్సీ 1104), ధర్మయ్య(హెచ్సీ 1295), లాల్ సింగ్(మెట్పల్లి పీఎస్) ఎంపికయ్యారు.
సిరిసిల్ల డీఎస్పీ నర్సయ్యకు మహోన్నత సేవా పతకం
సిరిసిల్ల రూరల్, న్యూస్లైన్: సిరిసిల్ల డీఎస్పీ దామెర నర్సయ్యకు ప్రభుత్వం ప్రతిష్టాత్మక అవార్డును ప్రకటించింది. శాంతిభద్రత పరిరక్షణలో తనదైన శైలితో ముందుకెళ్తూ నేరాల సంఖ్య తగ్గించడంలో డీఎస్పీ నర్సయ్య విజయవంతమయ్యారు. ఆయన తీసుకున్న చర్యలను గుర్తించిన ప్రభుత్వం ఈ మహోన్నత సేవా పతకాన్ని పతకాన్ని ప్రకటించింది.
త్వరలో నిర్వహించే కార్యక్రమంలో ఈ అవార్డును నర్సయ్యకు ప్రదానం చేయనున్నారు. 1992లో సేవాపతకం, 2005లో ఉత్తమ సేవాపతకం, 2014లో మహోన్నత సేవా పతకం అందుకున్నారు. డీఎస్పీ నర్సయ్యకు ఈ అవార్డు రావడంపై సబ్ డివిజన్ సీఐలు నాగేంద్రచారి, రంగయ్య, శ్రీనివాస్, ఎస్సైలు హర్షం ప్రకటించారు. ఆయనకు అభినందనలు తెలిపారు.