అదృశ్యమైన ఓ యువతి మరుసటి రోజే అనుమానాస్పద పరిస్థితుల్లో శవమై కనిపించింది.
హైదరాబాద్: అదృశ్యమైన ఓ యువతి మరుసటి రోజే అనుమానాస్పద పరిస్థితుల్లో శవమై కనిపించింది. ఈ సంఘటన ఉప్పల్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు అంబర్ పేటకు చెందిన కమాలుద్దీన్ కూతురు మెహర్ ఉన్నీసాబేగం(25) శనివారం ఇంట్లో నుంచి బయటకు వెళ్ల్లి సాయంత్రం వరకు కూడా తిరిగి రాలేదు. ఎంత వెతికినా ఫలితం లేక పోవడంతో అదే రోజు కుటుంబ సభ్యులు అంబర్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా, మెహర్ ఉన్నీసాబేగం ఆదివారం ఉదయం రామంతాపూర్లోని రాంశంకర్నగర్ నాలా వద్ద శవమై తేలింది. స్థానికుల సమాచారం మేరకు ఉప్పల్ పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా, మృతదేహంపై గాయాలున్నట్లు సమాచారం.