లండన్: విమానం టేకాఫ్ తీసుకున్న గంటలోపే ఓ ప్రయాణికురాలు అకస్మాత్తుగా ప్రాణాలు విడిచింది. అయినప్పటికీ పైలట్లు ప్రయాణాన్ని కొనసాగించాలనే నిర్ణయం తీసుకున్నారు. అలా, ఆ మృతదేహం కనీసం 13.5 గంటలపాటు విమానంలో ఉండిపోగా, చెడు వాసనతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఈ ఘటన ఆదివారం బ్రిటిష్ ఎయిర్ వేస్కు చెందిన విమానంలో చోటుచేసుకుంది.
హాంకాంగ్ నుంచి టేకాఫ్ తీసుకున్న గంట సమయానికి విమానంలోని 60 ఏళ్ల ప్రయాణికురాలొకరు అనారోగ్యంతో చనిపోయారు. ఇలాంటి సందర్భాలను మెడికల్ ఎమర్జెన్సీగా భావించరాదన్న నియమాల ప్రకారం పైలట్లు ప్రయాణాన్ని కొనసాగించారు. మృతదేహాన్ని విమానం వెనుక భాగంలోని ఓ మూలన ఉంచారు. అక్కడ వేడిగా ఉండటంతో కొద్ది సేపటికే మృతదేహం నుంచి చెడు వాసన వస్తున్నట్లు ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. హీత్రూ విమానాశ్రయంలో ల్యాండయ్యాక..విచారణ కోసం 45 నిమిషాలపాటు మొత్తం 331 మంది ప్రయాణికులు, సిబ్బందిని బయటకు వెళ్లనివ్వలేదు.


