రెండుగంటలు వేచి ఉన్నా అంబులెన్స్కు దొరకని పెట్రోల్
మహారాజ్గంజ్: దేశంలో ఇంధన కొరతకు అద్దం పట్టే ఘటన ఇది. పికప్ వ్యానులో మృతదేహాన్ని అంత్యక్రియల కోసం తరలిస్తుండగా అందులో ఇంధనం అయిపోయింది. దీంతో డ్రైవర్ వాహనాన్ని పెట్రోల్ పంపు వద్ద ఆపాడు. అప్పటికే అక్కడ భారీ క్యూ కొనసాగుతోంది. తన వ్యాన్లో మృతదేహం ఉందని చెప్పినప్పటికీ వాహనదారులు కనికరం దాల్చలేదు. బంక్ నిర్వాహకులు పట్టించుకోలేదు.
అలా, మృతదేహాన్ని ఉంచిన వాహనం రెండు గంటలపాటు క్యూలోనే ఉండిపోయింది. చివరికి, పెట్రోల్ అయిపోయిందని చెప్పి నిర్వాహకులు పంపును మూసివేశారు. ఈ విషాద ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్ లో వైరలవుతోంది. చివరికి మృతదేహాన్ని కూడా క్యూలోనే ఉంచారంటూ పలువురు వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్లోని మహారాజ్గంజ్లో చోటుచేసుకుంది.
నిచ్లౌల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిధావె గ్రామానికి చెందిన సర్వేశ్ కసౌధన్ బుధవారం చనిపోయారు. అతడి మృత దేహాన్ని ఉంచిన పికప్ వ్యాన్ నిచ్లౌల్– చియుటహాన్ రోడ్డులో ఉన్న శ్మశాన వాటికకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మృతదేహం ఉంచిన వాహనాన్ని పెట్రోల్ పంప్ వద్ద క్యూలో ఉంచడంపై సమాచారం అందిందని సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ సిద్థార్థ గుప్తా స్పందించారు. పెట్రోల్ పంప్ నిర్వాహకులకు నోటీసు ఇచ్చామన్నారు. నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే కేసు నమోదు చేస్తామని తెలిపారు.


