మహబూబాబాద్ బలరాంకే | congress to announce candidates for elections | Sakshi
Sakshi News home page

మహబూబాబాద్ బలరాంకే

Apr 6 2014 2:23 AM | Updated on Mar 9 2019 3:26 PM

కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా వచ్చేసింది. జిల్లాలోని ఏడు అసెంబ్లీ, ఒక పార్లమెంటు స్థానానికి పోటీచేసే అభ్యర్థులను ఏఐసీసీ అధికార ప్రతినిధి దణదీప్‌సుర్జేవాలా ప్రకటించారు.

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా వచ్చేసింది. జిల్లాలోని ఏడు అసెంబ్లీ, ఒక పార్లమెంటు స్థానానికి పోటీచేసే అభ్యర్థులను ఏఐసీసీ అధికార ప్రతినిధి దణదీప్‌సుర్జేవాలా ప్రకటించారు. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అనుమతి మేరకు శనివారం రాత్రి 10 గంటల తర్వాత ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ఈ జాబితాను విలేకరులకు వెల్లడించారు. ఈ జాబితా ప్రకారం మహబూబాబాద్ పార్లమెంటు స్థానం  సిట్టింగ్ ఎంపీ, కేంద్రమంత్రి బలరాం నాయక్‌కే కేటాయించారు. సీపీఐతో పొత్తు కారణంగా ఖమ్మం పార్లమెంటు స్థానానికి అభ్యర్థిని ప్రకటించలేదు.
 
ఇక, సీపీఐకిచ్చే కొత్తగూడెం, వైరా, పినపాక స్థానాలు మినహా మిగిలిన ఏడు స్థానాలకు  అభ్యర్థుల ఖరారు ప్రక్రియ కూడా పూర్తయింది. కానీ, ఎంపీ స్థానాలకు అభ్యర్థులను వెల్లడించిన పార్టీ అధిష్టానం, ఆ తర్వాత ఎమ్మెల్యేల జాబితాను మీడియాకు ఇచ్చేందుకు నిరాకరించింది. అధిష్టానం ఆదేశాల మేరకే ఎమ్మెల్యేల జాబితా ప్రకటనను నిలిపివేసినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
 
 ఆదివారం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్నందున అభ్యర్థులను ప్రకటించవద్దని అధిష్టానం చెప్పడంతో నిలిపివేసినట్లు తెలుస్తోంది. అయితే, రణదీప్ తొలుత మాట్లాడుతున్న సమయంలోనే మధిర నుంచి భట్టి విక్రమార్క పోటీచేస్తారని చెప్పారు. కాంగ్రెస్‌మేనిఫెస్టో కమిటీ ఉపాధ్యక్షుడు, డిప్యూటీ స్పీకర్ హోదాలో పార్లమెంటు అభ్యర్థుల తర్వాత భట్టి పేరును ప్రకటిం చారు. మరోవైపు అభ్యర్థుల ప్రకటన నిలిపివేసిన తర్వాత ఖమ్మం అసెంబ్లీ స్థానానికి పువ్వాడ అజయ్‌ను ఖరారు చేసినట్టు మీడియాలో విసృత ప్రచారం జరిగింది. కానీ, అధికారికంగా పార్టీ మాత్రం ప్రకటించలేదు. ఆదివారం స్థానిక సంస్థల ఓటింగ్ అనంతరం జాబితాను వెల్లడించే అవకాశం ఉంది.
 
సీపీఐకే ఖమ్మం ఖిల్లా
పార్లమెంటు స్థానాల విషయానికి వస్తే తెలంగాణలోని ఖమ్మం మినహా 16 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీప్రకటించింది.  అంటే ఆ స్థానాన్ని సీట్ల సర్దుబాటులో సీపీఐకి ఇచ్చినట్టే. ఇక, జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలుండే మహబూబాబాద్ పార్లమెంటు స్థానం నుంచి పాతకాపు బలరాంనాయక్‌కే అవకాశం కల్పించారు. కేంద్రమంత్రి హోదాలో ఉన్న ఆయనకు మరోసారి పోటీకి వీలుకల్పించారు.

Advertisement
 
Advertisement
Advertisement