
సిటీలో చిరుత
రాజేంద్రనగర్లో చిరుత సంచరించిందనే వార్త మరోసారి స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. స్థానిక కిద్వాయ్ గార్డెన్ ప్రాంతంలో రెండు చిరుతలు కనిపించాయని అక్కడి సెక్యూరిటీగార్డుతో....
రాజేంద్రనగర్: రాజేంద్రనగర్లో చిరుత సంచరించిందనే వార్త మరోసారి స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. స్థానిక కిద్వాయ్ గార్డెన్ ప్రాంతంలో రెండు చిరుతలు కనిపించాయని అక్కడి సెక్యూరిటీగార్డుతో పాటు అటుగా వెళ్తున్న జీహెచ్ఎంసీ కాంట్రాక్ట్ ఉద్యోగి తెలపడంతో స్థానికులు పెద్ద ఎత్తున గుమిగూడారు. విషయాన్ని రాజేంద్రనగర్ పోలీసులకు తెలపడంతో వారు వచ్చి, స్థానిక యువకులతో కలసి కిష్టమ్మగుట్ట, పరిసర ప్రాంతాల్లో వెతికారు. మధ్యాహ్నం కురిసిన వర్షానికి నేల చిత్తడిగా మారడంతో చిరుత సంచరించినట్టు చెబుతున్న ప్రాంతంలో అడుగుజాడలు కనిపించాయి. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.
బుధవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో తాను కిద్వాయ్ గార్డెన్ ప్రధాన ద్వారం వద్ద విధులు నిర్వహిస్తుండగా, కిష్టమ్మగుట్ట వైపు వెళ్తూ చిరుత కనిపించిందని సెక్యూరిటీ గార్డు అంజయ్య స్థానికులకు తెలిపాడు. ఇదే సమయంలో రాజేంద్రనగర్ జీహెచ్ఎంసీలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్న విక్రమ్కుమార్ కిస్మత్పూర్ నుంచి బుద్వేల్ వైపు వస్తుండగా రెండు చిరుతలు వంతెన దాటుతూ కనిపించాయి.
దీంతో అతను గ్రామంలోకి వెళ్లి స్థానికులకు విషయం తెలిపాడు. వారు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అక్కడి నేలపై పులి అడుగుజాడలు కనిపించడంతో భయాందోళనకు గురయ్యారు. రాజేంద్రనగర్ పోలీసులకు, ఏజీ వర్సిటీ సెక్యూరిటీ అధికారులకు సమాచారం అందించారు. పోలీసులు మాత్రం చిరుత సంచారం లేదంటూ కొట్టిపారేశారు.
సందర్శించిన సెక్యూరిటీ ఇన్చార్జ్, ఏఆర్ఐ అధికారులు....
కిద్వాయ్ గార్డెన్ పరిసరాలలో చిరుత సంచరించిందనే సమాచారాన్ని సెక్యూరిటీ ఇన్చార్జ్ నజీర్ అహ్మద్కు అందించారు. ఆయన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. కాటేజీ ఇన్చార్జ్ కృష్ణపంతులు, ఏఆర్ఐ ప్రొఫెసర్ మధుసూదన్రెడ్డిలు గార్డెన్ వద్దకు వచ్చి సెక్యూరిటీ సిబ్బంది, ఇతర ఉద్యోగులతో మాట్లాడి, ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఈ విషయాన్ని లిఖితపూర్వకంగా రంగారెడ్డి డీఎఫ్వోకు వివరించనున్నట్లు ప్రొఫెసర్ మధుసూదన్రెడ్డి వెల్లడించారు.
భయం భయం
చిరుత సంచరిస్తున్న విషయం తెలుసుకున్న కిష్టమ్మగుట్ట, బుద్వేల్, టీచర్స్కాలనీ తదితర ప్రాంతాలకు చెందిన ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. మంగళవారం రాత్రి చిరుతజాడ కనిపించిందని తెలిపినా పోలీసులు, అటవీశాఖ అధికారులు స్పందించ లేదని ఆరోపిస్తున్నారు. బుధవారం సాయంత్రం 5.30 నుంచే పరిసర ప్రాంతాలన్నీ నిర్మానుష్యంగా మారాయి.
అధికారుల పరిశీలన
రాజేంద్రనగర్లోని కిద్వాయ్గార్డెన్, కిష్టమ్మగుట్ట పరిసర ప్రాంతాలలో చిరుత సంచరించిన ప్రాంతాలను బుధవారం రాత్రి రంగారెడ్డి జిల్లా అటవీశాఖ అధికారులు పరిశీలించారు. స్థానికులు ఆయా ప్రాంతాలలో చిరుత పాదాల ముద్రలు ఉన్నాయంటూ చూపించడంతో వాటిని సేకరించడంతో పాటు ఫొటోలు తీశారు. వాటిని ల్యాబ్లో పరిశీలించడంతో పాటు నిపుణులకు చూపించనున్నట్లు డీఎఫ్వో గురుప్రసాద్ తెలిపారు. తమ సిబ్బంది గాలించారని, చిరుత జాడ తెలియలేదన్నారు.