మెట్రో పోలీస్

మెట్రో పోలీస్ - Sakshi


... ఇక సూపర్ కాప్

 సేఫ్, స్మార్ట్ సిటీగా రాజధాని.. ఎక్కడికక్కడ ట్రాకింగ్ వ్యవస్థ

 ఐక్యరాజ్యసమితి భద్రతా దళాల తరహాలో ప్రత్యేక డ్రెస్‌కోడ్

 ఆధునిక హంగులతో 1,650 ఇన్నోవా వాహనాలు

 ల్యాప్‌టాప్‌లు, జీపీఎస్, ఇంటర్‌నెట్, వైర్‌లెస్ వ్యవస్థలు

 ‘గల్లీ గస్తీ’ పేరిట 1,500 బైక్‌లతో పెట్రోలింగ్

 పోలీసు అధికారుల సమావేశంలో సీఎం కేసీఆర్ ఆదేశాలు

 

 సాక్షి, హైదరాబాద్: ముదురు నీలం రంగు ప్యాంటు, లేత నీలం రంగు చొక్కా..ఇన్నోవా వాహనాలు, ల్యాప్‌టాప్‌లు,     జీపీఎస్, వేగమైన ఇంటర్‌నెట్, వైర్‌లెస్ వ్యవస్థ.. నిమిషాల్లోనే ప్రత్యక్షమయ్యే పోలీసులు.

 పాశ్చాత్య దేశాల్లో కనిపించే పోలీసింగ్ తీరిది.

 మరికొద్ది రోజుల్లోనే ఈ అత్యాధునిక పోలీస్ వ్యవస్థ

 మన హైదరాబాద్‌లో కనిపించనుంది.

 

ఐక్యరాజ్యసమితి భద్రతా బలగాల తరహాలో ఇక్కడి పోలీసులకు ఆధునిక సౌకర్యాలు సమకూరనున్నాయి. పోలీస్ అంటే ఖాకీ డ్రెస్, టోపీ, చేతిలో లాఠీ అనే విధానం ఇక కనుమరుగు కాబోతోంది. రాజధానిలో పోలీసు రూపురేఖలు పూర్తిగా మారిపోబోతున్నాయి. చైన్ స్నాచింగ్ దగ్గరి నుంచి తీవ్రమైన నేరాలదాకా అన్నింటినీ పూర్తి స్థాయిలో నియంత్రించి హైదరాబాద్‌ను సేఫ్ సిటీగా, స్మార్ట్ సిటీగా మార్చేందుకు తోడ్పడే సౌకర్యాలు పోలీసులకు అందబోతున్నాయి. బస్తీల్లో పహారా కోసం మోటారు సైకిళ్ల మీద ‘గల్లీ గస్తీ’ పోలీసులు రానున్నారు. నేరం ఎక్కడ జరిగినా.. పది నిమిషాల్లోగా పోలీసులు ఆ స్థలంలో ఉండేలా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించబోతున్నారు. రాష్ట్ర రాజధానిని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలని యోచిస్తున్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆలోచనల మేరకు ఇవన్నీ అందుబాటులోకి రానున్నాయి.

 

 శనివారం తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, సీఎస్ రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ, హైదరాబాద్, సైబరాబాద్‌ల పోలీసు కమిషనర్లు మహేందర్‌రెడ్డి, సీవీ ఆనంద్, ఇతర ఉన్నతాధికారులతో కేసీఆర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సేఫ్ అండ్ స్మార్ట్ సిటీగా హైదరాబాద్‌కు బ్రాండ్ ఇమేజ్ తీసుకురావాలని అధికారులకు ఆదేశించారు. తొలి ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ల పరిధిలో పోలీసు వ్యవస్థ తీరుతెన్నులను పూర్తిగా మార్చాలని పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు. లండన్, న్యూయార్క్ వంటి నగరాల్లోని పోలీసు వ్యవస్థను ఆదర్శంగా తీసుకుని తదనుగుణంగా మార్పులు చేయాలని కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఏ నేరం జరిగినా పది నిమిషాల్లో పోలీసులు సంఘటనా స్థలంలో ఉండాలని.. ఎక్కడికక్కడ ట్రాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మహిళలకు పూర్తి రక్షణ కల్పించడం ద్వారా వారు అర్ధరాత్రి కూడా స్వేచ్ఛగా విధులు నిర్వహించుకునే పరిస్థితులు తీసుకురావాలని సూచించారు. హైదరాబాద్‌లోని ట్యాక్సీలు ముంబై తరహాలో కామన్ బ్రాండింగ్ (ఒకే రంగు వాహనాలు) కలిగి ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కాగా.. రాజధానిలో శాంతిభద్రతల సమస్యల పరిష్కారానికి జీహెచ్‌ఎంసీ, ఆర్టీసీ, ఇతర శాఖలతో పాటు మంత్రులతో త్వరలో సమావేశం నిర్వహించనున్నట్లు కేసీఆర్ చెప్పారు.  

 

 జూబ్లీహిల్స్‌లో పోలీసు భవనాలు: జూబ్లీహిల్స్‌లో గుర్తించిన ఎనిమిది ఎకరాల స్థలంలో హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లను కొత్తగా నిర్మించాలని... ట్రాఫిక్, ఇతర నగర రక్షణ వ్యవస్థల ప్రధాన కార్యాలయాలన్నీ ఇక్కడి నుంచే విధులు నిర్వర్తించేలా బహుళ అంతస్థుల భవనాలను నిర్మించాలని కేసీఆర్ నిర్ణయించినట్లు సమావేశం అనంతరం హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మీడియాకు వెల్లడించారు. పోలీసుల కొత్త డ్రెస్‌కోడ్ వీలైనంత త్వరలో అమల్లోకి వస్తుందని.. మిగతా నిర్ణయాలన్నీ ఆగస్టు 15లోగా అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు. శాంతి భద్రతలు పరిరక్షించే పోలీసులతో పాటు ట్రాఫిక్ పోలీసులకు కూడా ఆధునిక హంగులు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ట్రాఫిక్ పోలీసులు కాలుష్యం బారిన పడకుండా రక్షణ చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. రిక్రూట్‌మెంట్ ద్వారా పోలీసు వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నట్లు హోంమంత్రి పేర్కొన్నారు.

 

 పాత వాహనాలకు చెక్

 హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ప్రస్తుతమున్న పోలీసు వాహనాలను సమూలంగా మార్చివేయాలని ముఖ్యమంత్రి నిర్ణయిం చారు. వాటి స్థానంలో 1,650 కొత్త ఇన్నోవా వాహనాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ వాహనాల్లోనే జీపీఎస్, 4జీ ఇంటర్‌నెట్, ల్యాప్‌టాప్, వైర్‌లెస్ వ్యవస్థ, సైరన్, అగ్నిమాపక పరికరాలను ఏర్పాటు చేస్తారు. హైదరాబాద్ పోలీసులకు ప్రత్యేక బ్రాండ్ ఉండేలా డ్రెస్‌కోడ్‌ను వీలైనంత త్వరగా మార్చనున్నారు.

 

 1,500 బైకులతో ‘గల్లీగస్తీ’..

 

 హైదరాబాద్ నగరంలో పోలీసు పహారాను విస్తృతంగా పెంచేందుకు ‘గల్లీ గస్తీ’ పేరిట మోటారు సైకిళ్లతో కూడిన పెట్రోలింగ్ వ్యవస్థను కేసీఆర్ రూపొందించారు. బస్తీల్లో 24 గంటలూ పోలీసులు పహారా కాయడం వల్ల చైన్ స్నాచింగ్, దొంగతనాలు, ఆకతాయిల చేష్టలకు అడ్డుకట్ట పడుతుందని ఆయన పోలీసు అధికారులకు సూచించారు. ‘గల్లీ గస్తీ’ కోసం 1,500 కొత్త మోటారు సైకిళ్లను కొనుగోలు చేసి షిఫ్టుల వారీగా పోలీసులు పహారా కాసే వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తద్వారా ఎక్కడ నేరం జరిగినా 10 నిమిషాల్లోనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించే పరిస్థితులను కల్పించేలా వాహన వ్యవస్థను రూపొందించుకోవాలన్నారు. మహిళా ఉద్యోగులు, విద్యార్థినులకు స్వేచ్ఛ, భద్రత విషయంలో పోలీసులు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, బస్టాపుల్లో పోలీస్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఉండాలని సూచించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top