
వైద్య ఆరోగ్యశాఖలో సీసీ కెమెరాలు
వైద్య ఆరోగ్యశాఖ పారదర్శకతపై దృష్టి సారించింది. అక్రమాలు, అవినీతికి ఆస్కారం ఉన్న ప్రధాన కార్యాల యాల్లో ఐపీ అడ్రస్ కలిగిన సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆ శాఖ యోచిస్తోంది.
- పారదర్శకతకు ప్రాధాన్యం... అవినీతి, అక్రమాలకు చెక్
- ముఖ్య అధికారుల చాంబర్లు, కారిడార్లలో ఏర్పాటు
- ప్రధాన ఆసుపత్రుల్లోనూ ఏర్పాటు చేయాలని యోచన
హైదరాబాద్: వైద్య ఆరోగ్యశాఖ పారదర్శకతపై దృష్టి సారించింది. అక్రమాలు, అవినీతికి ఆస్కారం ఉన్న ప్రధాన కార్యాల యాల్లో ఐపీ అడ్రస్ కలిగిన సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆ శాఖ యోచిస్తోంది. ఇప్పటికే ఆ శాఖ ముఖ్యకార్యదర్శి సురేష్చందా తన చాంబర్లో స్వయంగా సీసీ కెమెరా ఏర్పాటుచేసుకుని ఆదర్శంగా నిలవడమే కాకుండా, శాఖలోని వివిధ విభాగాల ముఖ్య అధికారుల కార్యాలయాలు, ప్రధాన ఆసుపత్రుల్లో ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు.
తద్వారా అవినీతి అక్రమాలకు చెక్ పెట్టడం... రోగులకు సంపూర్ణ వైద్య, ఆరోగ్య సేవలను అందించవచ్చని పేర్కొంటున్నారు. ప్రత్యేక సాఫ్ట్వేర్తో ఆయా కార్యాలయాల్లో జరిగే అన్ని వ్యవహారాలను ఇంటర్నెట్ ద్వారా వీక్షించేలా ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నారు. ఆయా కార్యాలయాల నుంచి సచివాలయంలోని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి, ముఖ్యకార్యదర్శి చాం బర్లకు అనుసంధానం చేస్తారు.
ఆస్పత్రుల్లో సేవల పర్యవేక్షణ
వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోకి వచ్చే రాష్ట్ర స్థాయి ముఖ్య ఆసుపత్రులైన గాంధీ, ఉస్మానియా, నీలోఫర్ వంటి వాటిల్లోనూ... అలాగే పరిపాలనా విభాగాలైన ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, తెలంగాణ రాష్ట్ర మౌలికసేవలు, సదుపాయాల సంస్థ, ఆరోగ్యశ్రీ ట్రస్టు వంటి వాటిల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. ఇప్పటికే గాంధీలో 200 కెమెరాలు ఏర్పాటుచేశారు. కోఠిలోని వైద్యవిద్యాశాఖ సంచాలకుని చాంబర్, కారిడార్లలోనూ వీటిని బిగించారు.
కొద్దిరోజుల్లో వీటిని ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సీసీ కెమెరాలను కంట్రోల్రూంతో అనుసంధా నం చేయడం ద్వారా ఆయా ఆస్పత్రుల్లో వైద్య సేవలు, పారిశుధ్యం, రోగులకు తలెత్తే ఇబ్బం దులు ఎప్పటికప్పుడు తెలుసుకుని అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వడానికి వీలు కలుగుతుంది. సంబంధిత మంత్రి, ఉన్నతాధికారుల పర్యవేక్షణకు సులవవుతుంది.
ఏదీ రహస్యం కాదు...
'ఆర్టీఐ చట్టం వచ్చాక ఏదీ రహస్యం కాదు. ఎవరు ఎప్పుడు ఏది అడిగినా నిర్ణీత కాలంలో వారికి ఆ సమాచారం ఇస్తున్న నేపథ్యంలో ఎవరూ అడగకుండానే సమాచారం అందరికీ అందుబాటులో ఉంచడం మరింత పారదర్శకత అవుతుంది కదా'
- సురేష్చందా, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి