పాంచ్‌కా ఖానా.. తీన్ కా నాస్త | boinpally market in Low-price lunch, breakfast | Sakshi
Sakshi News home page

పాంచ్‌కా ఖానా.. తీన్ కా నాస్త

Jun 25 2014 12:49 AM | Updated on Aug 30 2019 8:37 PM

పాంచ్‌కా ఖానా.. తీన్ కా నాస్త - Sakshi

పాంచ్‌కా ఖానా.. తీన్ కా నాస్త

వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది వాస్తవం.

- బోయిన్‌పల్లి మార్కెట్‌లో తక్కువ ధరలో భోజనం, టిఫిన్
- వెల్లడించిన మంత్రి హరీష్‌రావు  
- ఉన్నతాధికారులతో కలిసి మార్కెట్ పరిశీలన
- సమస్యల పరిష్కారంపై అక్కడికక్కడే సమీక్ష

 కంటోన్మెంట్: వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది వాస్తవం. అయితే ఇది నగరం మొత్తం కాదండోయ్..నగరం చుట్టుపక్కల ఆయా ప్రాంతాల నుంచి ఎంతో శ్రమించి కూరగాయలు తీసుకొచ్చే రైతులు,హమాలీల కోసం బోయిన్‌పల్లి మార్కెట్‌లో తక్కువ ధరలో టిఫిన్ ,భోజనం అందించనున్నారు. ఈమేరకు త్వరలో క్యాంటీన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు మార్కెటింగ్‌శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రకటించారు. మరోమంత్రి పద్మారావు,మార్కెటింగ్ ఉన్నతాధికారులతో కలిసి మంగళవారం ఉదయం మార్కెట్‌ను సందర్శించిన ఆయన సుమారు 3గంటలపాటు కలియతిరిగారు.

ప్రతీ సమస్యను నేరుగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. నేరుగా షాపుల వద్దకు చేరుకుని మార్కెట్‌లోకి కూరగాయలు తీసుకొచ్చిన రైతులు, హమాలీలు, కమీషన్ ఏజెంట్లు,రిటైల్ విక్రేతలతో మాట్లాడారు. ధరల గురించి ఆరాతీశారు. ఈ సందర్భంగా హామాలీలు ప్రధానంగా క్యాంటీన్ సమస్యను మంత్రి ద ృష్టికి తీసుకొచ్చి సదరు కాంట్రాక్టర్‌పై ఫిర్యాదు చేశారు. అక్కడ్నుంచి మరుగుదొడ్లు, మంచినీటి ట్యాంకులు, క్యాంటీన్, నిరుపయోగంగా ఉన్న రైతుల రెస్ట్‌రూమ్‌లను పరిశీలించారు.

అనంతరం మార్కెట్‌యార్డు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షించిన అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. రైతులు, హమాలీలు, దూరప్రాంతాల నుంచి వచ్చిన వారు ఇబ్బందిపడుతున్న నేపథ్యంలో త్వరలో రూ.3 అల్పాహారం, రూ.5కే భోజనాన్ని అందిస్తామని, ఇప్పటికే జీహెచ్‌ఎంసీ పరిధిలో కొనసాగుతున్న ఇలాంటి విధానంపై అధ్యయనం చేసి అతిత్వరలో మార్కెట్‌యార్డులోనూ సబ్సిడీతో కూడి న క్యాంటీన్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

బినామీ పేర్ల మీద నడుస్తున్న దుకాణాలు, కేటాయింపు జరిగినా రోడ్డుపైనే క్రయ,విక్రయాలు సాగిస్తున్న 39 దుకాణాల అంశంపై త్వరలో కీలక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.  ధరల నియంత్రణపై దృష్టి : కూరగాయ ల ధరల నియంత్రణకు ఉన్నతాధికారులతో కూడిన కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు హరీశ్‌రావు పేర్కొన్నారు. పలురకాల కూరగాయలను వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నందున..వాటి ధరల్ని రాష్ట్రస్థాయిలో నియంత్రించలేకపోతున్నామని చెప్పారు. ఈ పర్యటనలో మంత్రి వెంట ఆయాశాఖల ఉన్నతాధికారులు పూనం మాలకొండయ్య, జనార్దన్‌రెడ్డి, లక్ష్మీభాయి తదితరులున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement