నీటి మీటర్లు లేకుంటే రెట్టింపు బిల్లులు | Bills have doubled in the absence of water meters | Sakshi
Sakshi News home page

నీటి మీటర్లు లేకుంటే రెట్టింపు బిల్లులు

Apr 2 2014 12:40 AM | Updated on Aug 21 2018 12:12 PM

నీటి మీటర్లు లేకుంటే రెట్టింపు బిల్లులు - Sakshi

నీటి మీటర్లు లేకుంటే రెట్టింపు బిల్లులు

మధ్యతరగతిపై బాదుడుకు జలమండలి మరో అస్త్రాన్ని సిద్ధం చేస్తోంది. గ్రేటర్ పరిధిలో గృహ వినియోగ కుళాయిలకు(డొమెస్టిక్) నీటి మీటర్లు లేని వినియోగదారుల నుంచి రెట్టింపు నీటి చార్జీలు వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది.

సాక్షి, సిటీబ్యూరో: మధ్యతరగతిపై బాదుడుకు జలమండలి మరో అస్త్రాన్ని సిద్ధం చేస్తోంది. గ్రేటర్ పరిధిలో గృహ వినియోగ కుళాయిలకు(డొమెస్టిక్) నీటి మీటర్లు లేని వినియోగదారుల నుంచి రెట్టింపు నీటి చార్జీలు వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం మహానగర పరిధిలోని బడా కుళాయిలకు(బల్క్) మీట రింగ్ పాలసీని అమలు చేస్తుండగా.. త్వరలో డొమెస్టిక్ కేటగిరీలోనూ ఈ విధానాన్ని అమలుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు జలమండలి మేనేజింగ్ డెరైక్టర్ శ్యామలరావు తెలిపారు.
 
మంగళవారం ఖైరతాబాద్‌లో ని బోర్డు కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గ్రేటర్ పరిధిలో మీటర్లు లేని గృహవినియోగ కనెక్షన్లు సుమారు నాలుగు లక్షల వరకు ఉన్నాయి. మీటరింగ్ పాలసీ అమలు చేసిన పక్షంలో వీరందరికీ బాదుడు తథ్యమన్న సంకేతాలు వెలువడుతున్నాయి. అంటే ప్రస్తుతం నెలకు రూ.200 బిల్లు చెల్లిస్తున్న వారు రూ.400 బిల్లు చెల్లించక తప్పని పరిస్థితి రానుంది.
 
 బోర్డు పురోగతిపై ఎండీ తెలిపిన విశేషాలివే..
 
 వేసవిలో నో పానీపరేషాన్...

 గ్రేటర్‌కు మంచినీరందిస్తున్న జలాశయాల్లో నీటి నిల్వలు సంతృప్తికరంగా ఉండడంతో జూలై చివరి నాటి వరకు నగరంలో మంచినీటి కటకట ఉండదని ఎండీ స్పష్టం చేశారు. వేసవిలో నీటి కొరత తీవ్రంగా ఉన్న ప్రాంతాలకు 24 గంటల పాటు అదనపు ట్యాంకర్ ట్రి ప్పుల ద్వారా మంచినీరు సరఫరా చేస్తామని తెలిపారు.
 
 రికార్డు అదాయం..

మార్చి 31 వరకు జలమండలి రికార్డు రెవెన్యూ ఆదాయం ఆర్జించిందని ఎండీ వెల్లడించారు. మార్చి నెలలో 4.50 లక్షల మంది వినియోగదారులు బిల్లులు చెల్లించడంతోపాటు జీహెచ్‌ఎంసీ నుంచి రావాల్సిన ఆస్తిపన్ను వాటాలో రూ.53 కోట్లు జలమండలి ఖజానాకు చేరడంతో ఒకే నెలలో రూ.160 కోట్లు రెవెన్యూ ఆదాయం లభించిందన్నారు.
 
 గడువు పెంపు లేదు..

నీటి బిల్లు బకాయిల వసూలుకు వన్‌టైమ్ సెటిల్‌మెంట్, అక్రమ కుళాయిల క్రమబద్ధీకరణ పథకాలకు చివరి గడువు మార్చి 31తో ముగిసినందున ప్రస్తుతానికి గడువు పెంచలేమని స్పష్టంచేశారు. ఎన్నికల అనంతరమే దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు.  
 
జూన్ నాటికి కృష్ణా మూడోదశ...
ఈ ఏడాది జూన్ చివరి నాటికి కృష్ణా మూడోదశ పథకం మొదటి దశను పూర్తిచేసి నగరానికి 45 ఎంజీడీల జలాలు తరలిస్తామన్నారు. గోదావరి మంచినీటి పథకం మొదటి దశను ఈ ఏడాది డిసెంబరు నాటికి పూర్తయ్యే అవకాశాలున్నాయని చెప్పారు. టెండర్ల ప్రక్రియ పూర్తై మల్కాజ్‌గిరి మంచినీటి పథకం పనులకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిస్తేనే పనులు మొదలు పెడతామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement