ట్యాంకుపైకి ఎక్కి దూకుతానంటూ...

Bank Service Center Agent Cheats Customers In Medak - Sakshi

చిన్నశంకరంపేట(మెదక్‌) : మండలంలోని ఖాజాపూర్‌లో బ్యాంకు సేవ కేంద్రం ఏజెంట్‌గా పనిచేస్తున్న వెంకట్‌ వాటర్‌ ట్యాంకుపైకి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటున్నానని కాసేపు హల్‌చల్‌ చేశారు. గురువారం ఉదయం ఖాజాపూర్‌ మధిర గ్రామమైన కుమ్మరిపల్లిలో వెంకట్‌ ట్యాంకుపైకి వెళ్లి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు గ్రామస్తులకు సమాచారం అందించాడు. దీంతో గ్రామస్తులు అక్కడికి చేరుకుని అతడిని సముదాయించారు. చిన్నశంకరంపేట పోలీస్‌లకు కూడా సమాచారం అందించడంతో వారు కూడ అక్కడికి చేరుకుని ట్యాంకుపై ఉన్న వెంకట్‌కు నచ్చజెప్పి కిందకు దించారు.

తరువాత కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా వారం రోజుల క్రితం గ్రామంలోని బ్యాంకు సేవ కేంద్రంతో ఖాతాదారుల డబ్బులు తన ఖాతాలోకి మల్లించుకున్న సంఘటన బయటపడడంతో గ్రామస్తులు ఎవరి డబ్బులు వారికి చెల్లించాలని అతడిని హెచ్చరించారు. అలాగే కొందరికి చెల్లించడంతో పాటు మరి కొంత మందికి చెల్లించేందుకు గడువు కోరిన వెంకట్‌ ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు. డబ్బులు తిరిగి ఇవ్వకుండ బెదిరించేందుకు ఈ డ్రామకు పాల్పడ్డాడని ఆరోపిస్తున్నారు. గురువారం నాడు మరో సారి గ్రామంలో మాట్లాడుదామని చెప్పడంతోనే ఇలా చేశాడని తెలిపారు.

ఈ విషయంపై విచారణ జరిపేందుకు నార్సింగి ఎస్‌బీఐ మేనేజర్‌ దీపిక ఖాజాపూర్‌ గ్రామానికి చేరుకున్నప్పటికి బ్యాంకు సేవ కేంద్రానికి తాళం ఉండడంతో పాటు వెంకట్‌ అందుబాటులో ఉండకపోవడంతో ఆమె వెనక్కి వెళ్లారు. విచారణ జరిపి అతడిపై చర్యలు తీసుకోనున్నట్లు ఆమె తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top