‘పోలవరం’ ఆర్డినెన్స్ అప్రజాస్వామికం | bandh against the polavaram ordinance | Sakshi
Sakshi News home page

‘పోలవరం’ ఆర్డినెన్స్ అప్రజాస్వామికం

Jul 12 2014 4:18 AM | Updated on Aug 21 2018 8:34 PM

తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకు చెందిన ఏడు మండలాలను పోలవరం ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్‌లో కలపడం అప్రజాస్వామికమని టీఆర్‌ఎస్ నాయకులు అన్నారు.

టీఆర్‌ఎస్ నాయకుల ఆగ్రహం
చంద్రశేఖర్ కాలనీ: తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకు చెందిన ఏడు మండలాలను పోలవరం ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్‌లో కలపడం అప్రజాస్వామికమని టీఆర్‌ఎస్ నాయకులు అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ఆమోదం తెలుపుతూ ఆర్డినెన్స్ జారీ చేయడాన్ని నిరసిస్తూ టీఆర్‌ఎస్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక ఎన్టీఆర్ చౌరస్తా వద్ద కేంద్ర, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర , ఏపీ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు.

అనంతరం టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కలుపుతూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. వెంటనే ఈ ఆర్డినెన్స్‌ను ఉపసంహరించాలని ఆయన డిమాండ్ చేశారు. టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు పోశెట్టి మాట్లాడుతూ పార్లమెంట్‌లో బిల్లుపెట్టి పోలవరం ఆమోదించడంతోనే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల చూపుతున్న వివక్షత స్పష్టమవుతోందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు సుజీత్‌సింగ్, ఆదె ప్రవీణ్‌కుమార్, మట్టెల శేఖర్, అక్తర్, టీఆర్‌ఎస్ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు తారిక్ అన్సారీ, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్‌రావు, కార్పొరేటర్ ఏనుగందుల మురళి, శీల మురళీధర్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement