గోదావరిపై మరో రిజర్వాయర్‌ | Sakshi
Sakshi News home page

గోదావరిపై మరో రిజర్వాయర్‌

Published Sun, Sep 24 2017 1:19 AM

Another reservoir on Godavari

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో గోదావరి నీటిని వినియోగంలోకి తెచ్చేలా మరో రిజర్వాయర్‌ నిర్మాణా నికి రంగం సిద్ధమైంది. ఆదిలాబాద్‌ జిల్లాలోని నేరడిగొండ, ఇచ్చోడ మండలాల మధ్య కుప్టి గ్రామం వద్ద రిజర్వాయర్‌ నిర్మాణానికి సంబంధించిన ప్రాజెక్టు సమగ్ర నివేదిక (డీపీఆర్‌) శనివారం ప్రభుత్వానికి అందింది. 5.32 టీఎంసీల సామర్ధ్యంతో రూ. 744.44 కోట్ల వ్యయ అంచనాతో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతిపాదనలు అందాయి. దీనిపై నీటిపారుదలశాఖ ఉన్నతస్థాయి పరిశీలన పూర్తయ్యాక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.


కడెం ఆయకట్టుకు ధీమా: ఆదిలాబాద్‌ జిల్లాలో నేరడిగొండ, ఇచ్చోడ మండలాల పరిధిలో రెండు కొండల మధ్య నుంచి కడెం వాగు ప్రవహిస్తుంటుంది. ఈ కొండలను కలుపుతూ ఆనకట్ట నిర్మాణం చేపడితే సుమారు 6.22 టీఎంసీల నీటిని వినియోగంలోకి తేవచ్చని ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం అంచనా వేసింది. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం కేసీఆర్‌ నీటి నిల్వలకు అనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ప్రతిపాదించారు. ఈ ఆదేశాల మేరకు ఎస్‌ఆర్‌ఎస్‌ కన్సల్టెన్సీ డీపీఆర్‌ సమర్పించింది.

గోదావరిపై 394 మీటర్‌ లెవల్‌తో 5.32టీఎంసీల సామర్ధ్యంతో రిజర్వాయర్‌ నిర్మించేలా ప్రతిపాదించింది. దీన్ని కడెం ప్రాజెక్టుకు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌గా వాడుకోవచ్చంది. కడెం ప్రాజెక్టుకు 13.42 టీఎంసీల కేటాయింపులున్నా ప్రాజెక్టులో పూర్తి నిల్వ సామర్థ్యం 7.2 టీఎంసీలు మాత్రమే. మిగిలిన 6.22 టీఎంసీల నీటిని వాడులేకపోతున్న దృష్ట్యా కుప్టితో ఆ కొరత తీర్చవచ్చని తెలిపింది. రిజర్వాయర్‌ నిర్మాణంతో 4 గ్రామాల్లోని 1,037 కుటుంబాలు నిర్వాసితుల వుతాయని, మొత్తం నిర్వాసితుల సంఖ్య 3,024గా ఉంటుందని అంచనా వేసింది. నిర్వాసిత గ్రామా లతోపాటు మహుడ, మలకలపాడు, రాయికల్‌ గ్రామాల్లో మొత్తంగా 2,519.88 ఎకరాల భూమి ముంపు పరిధిలోకి రానుంది. 

Advertisement
Advertisement