ఇక 19 మండలాలు..

Another Mandal Will Be Added in Jagithyal District - Sakshi

కొత్తగా ఒడ్డెలింగాపూర్‌కు గ్రీన్‌సిగ్నల్‌

నిజామాబాద్‌లో ప్రకటించిన  సీఎం కేసీఆర్‌

14 గ్రామాలతో కొత్త మండలం

హామీ నెరవేర్చిన ఎంపీ కవిత

జిల్లా ఇకనుంచి 19 మండలాలతో పరిపాలన సాగించనుంది. ఇప్పటికే 18 మండలాలతో ఉన్న జిల్లాలో కొత్తగా ఒడ్డెలింగాపూర్‌ చేరింది. జిల్లా ఆవిర్భావం అనంతరం.. జగిత్యాల నుంచి జగిత్యాల రూరల్, సారంగాపూర్‌ మండలం నుంచి బీర్పూర్, ధర్మపురి నుంచి బుగ్గారం మండలాలను ఏర్పాటు చేశారు. 32 గ్రామాలతో ఉన్న రాయికల్‌ మండలకేంద్రం ఇటీవల మున్సిపాలిటీగా రూపాంతరం చెందింది.

ఎప్పటినుంచో రాయికల్‌ మండలాన్ని విభజించి.. రెండు మండలాలు చేయాలనే డిమాండ్‌ ఉన్నా.. నిజామాబాద్‌ జిల్లాకేంద్రంలో మంగళవారం టీఆర్‌ఎస్‌ చేపట్టిన ఎన్నికల ప్రచారసభలో భాగంగా ఒడ్డెలింగాపూర్‌ను కొత్త మండలం చేస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. 

రాయికల్‌(జగిత్యాల): పరిపాలన సౌలభ్యం కోసం ఇప్పటికే జిల్లాలో కొత్త మండలాలు ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. రాయికల్‌ మండలంలోని ఒడ్డెలింగాపూర్‌ గ్రామాన్ని మండలకేంద్రంగా ప్రకటించారు. ఎన్నోఏళ్లుగా ఒడ్డెలింగాపూర్‌ గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని గ్రామస్తులు ఎంపీ కల్వకుంట్ల కవిత, కలెక్టర్‌ శరత్‌కు వినతిపత్రాలు అందించారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఒడ్డెలింగాపూర్‌ను మండలకేంద్రంగా ఏర్పాటు చేస్తామని ఎంపీ కవిత హామీ ఇవ్వగా.. ఆ మేరకు సీఎం కేసీఆర్‌ నిజామాబాద్‌ వేదికగా ప్రకటించడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. గతంలో రాయికల్‌ మండలంలో 27 గ్రామాలు ఉండేవి. ఇటీవల రాయికల్‌ పట్టణాన్ని మున్సిపాలిటీగా మార్చారు. మరోవైపు ఆరు కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేశారు. రాయికల్‌ పోను ఆ సంఖ్య 32కు చేరింది. 

ఒడ్డెలింగాపూర్‌ మండలంలో 14 గ్రామాలు?

రాయికల్‌ మండలంలో 32 గ్రామాలు ఉండగా.. కొత్తగా ఏర్పాటు చేయనున్న ఒడ్డెలింగాపూర్‌లోకి 14 గ్రామాలు వెళ్లనున్నాయి. వీటిలో ఆల్యనాయక్‌తండా, బోర్నపల్లి, చింతలూరు, దావన్‌పల్లి, ధర్మాజీపేట, జగన్నాథపూర్, కైరిగూడెం, కట్కాపూర్, కొత్తపేట, మంక్త్యానాయక్‌తండా, ఒడ్డెరకాలనీ, తాట్లవాయి, వస్తాపూర్‌ గ్రామాలు ఒడ్డెలిం గాపూర్‌  పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. 

సీఎం, ఎంపీకి కృతజ్ఞతలు

జగిత్యాల నియోజకవర్గంలోనే రాయికల్‌ మండలంపై ఎంపీ కవిత ప్రత్యేక శ్రద్ధ చూపడంతోపాటు రాయికల్‌ పట్టణాన్ని మున్సిపాలిటీగా మార్చారు. కొద్దిరోజుల వ్యవధిలోనే రాయికల్‌ మండలంలోని ఒడ్డెలింగాపూర్‌ గ్రామాన్ని మండలకేంద్రంగా సీఎం కేసీఆర్‌ ప్రకటించడం హర్షణీయం. మండల ప్రజలంతా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రుణపడి ఉంటాం. ఎంపీ కవితకు, ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు.                                                                                                – సంజయ్‌కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే

గిరిజనులు అభివృద్ధి చెందుతారు
ఒడ్డెలింగాపూర్‌ గ్రామాన్ని సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక మండలంగా ప్రకటించడంతో మండల పరిధిలో ఉన్న 14 గ్రామాల గిరిజనులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. వివిధ పనులపై సమయబావంతో పాటు అన్ని రకాల సేవలు అందుతాయి. దీనికి సహకరించిన ఎంపీ కవితకు కృతజ్ఞతలు.                                                                        – పాలకుర్తి రవి, సర్పంచ్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top