ఇంకా ఆస్పత్రిలోనే... | And hospital ... | Sakshi
Sakshi News home page

ఇంకా ఆస్పత్రిలోనే...

Aug 2 2014 12:55 AM | Updated on Sep 2 2017 11:14 AM

మూసాయిపేట ఘటనలో తీవ్రంగా గాయపడిన వరుణ్‌గౌడ్(7) ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. గత పది రోజులుగా ఆ చిన్నారి కళ్లు కూడా తెరువలేదు.

  •      కళ్లు తెరవని వరుణ్‌గౌడ్...
  •      నెమ్మదిగా తేరుకుంటున్న ప్రశాంత్...
  •      శతవిధాలుగా ప్రయత్నిస్తున్న వైద్యులు
  • సాక్షి, సిటీబ్యూరో: మూసాయిపేట ఘటనలో తీవ్రంగా గాయపడిన వరుణ్‌గౌడ్(7) ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. గత పది రోజులుగా ఆ చిన్నారి కళ్లు కూడా తెరువలేదు. ప్రశాంత్(6) పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. శరత్(6), నితిషా(7)లు నెమ్మదిగా కోలుకుంటున్నారు.

    మూసాయిపేట్ రైల్వేక్రాసింగ్ ఘటనలో 18 మంది మృతి చెందగా, 20 మంది క్షతగాత్రులు సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చేరారు. వీరిలో వైష్ణవి, తరుణ్‌లు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇటీవలే మృతి చెందగా, 14 మంది డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే. మిగిలిన నలుగురినీ ప్రాణాపాయం నుంచి కాపాడేందుకు ఆస్పత్రికి చెందిన 40 మంది వైద్య నిపుణులు, 100 మంది పారా మెడికల్ స్టాఫ్ అహర్నిశలు శ్రమిస్తున్నట్లు ఆస్పత్రి మెడికల్ డెరైక్టర్ డాక్టర్ లింగయ్య స్పష్టం చేశారు.  
     
    పది రోజులుగా అదే స్థితి...
     
    వెంకటాయపల్లికి చెందిన మల్లేష్, లత దంపతులకు రుచిత గౌడ్(8), వరుణ్ గౌడ్(7), శృతి గౌడ్(6) ముగ్గురు పిల్లలు. వీరందరినీ కాకతీయ టెక్నో స్కూల్‌లో చదివిస్తున్నారు. ఘటన జరిగిన రోజు శృతి అక్కడికక్కడే మరణించింది. తీవ్రంగా గాయపడిన రుచితగౌడ్, వరుణ్‌గౌడ్‌లను యశోద ఆస్పత్రికి తరలించారు. రుచిత పూర్తిగా కోలుకోవడంతో గురువారం వైద్యులు ఆమెను డిశ్చార్జ్ చేశారు.

    కుమారుడు వరుణ్‌గౌడ్ పరిస్థితి మాత్రం అత్యంత విషమంగా ఉంది. మెదడు దెబ్బతింది. కుడి కాలర్ ఎముక విరిగింది. ఛాతి ఎముకలు విరిగి ఊపిరితిత్తులకు ఆనుకోవడంతో ఒత్తిడికి అవి దెబ్బతిన్నాయి. ఎడమ మోకాలి కార్టిలేజ్‌పై చర్మం అంతా ఊడిపోయింది. ఐదు రో జుల క్రితం ఆయనకు ప్లాస్లిక్ సర్జరీ చేశారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉన్నాడు. ఇప్పటి వరకు కళ్లు కూడా తెరువలేదు. శరీరంలో ఎలాంటి కదలిక లేదు. తరచూ ఫిట్స్ వస్తున్నాయి.

    గత పది రోజుల నుంచి మృత్యువుతో పోరాడుతున్నాడు. పూర్తిగా మందులే వినియోగిస్తున్నారు. మరో మూడు రోజులు గడిస్తే కానీ ఇప్పుడే ఏమీ చెప్పలేమని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. మిగతా పిల్లల్లాగే తన కుమారుడు వరుణ్‌గౌడ్ కూడా కోలుకుని క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని అతని తల్లిదండ్రులు కనిపించిన దేవుడినల్లా ప్రార్థిస్తున్నారు. కొడుకు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడనే తీపి కబురు కోసం కళ్లలో ఒత్తులు వేసుకుని ఆశగా ఎదురు చూస్తున్నారు.
     
    ప్రశాంత్ మెదడు చుట్టూ నీరు...
     
    వెంకటాయపల్లికి చెందిన స్వామి, నర్సమ్మ దంపతుల రెండో కుమారుడు ప్రశాంత్(6) ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. వరణ్‌గౌడ్‌తో పోలిస్తే ఇతని పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని చెప్పవచ్చు. పుర్రె ఎముక విరిగి మెదడుకు ఆనుకుంది. తలపై చర్మం ఊడిపోవడంతో ప్లాస్టిక్ సర్జరీ చేశారు. తొడ భాగంలోని కొంత చర్మాన్ని తీసి తలపై అమర్చారు. మెదడు చుట్టూ నీరు చేరుతుండటంతో మూడు రోజుల క్రితం సర్జరీ చేసి, నీటిని బయటికి తీసేశారు.

    ముఖంపై గాయాలు ఇంకా మాన లేదు. ఎడమ చేయి విరగడంతో శస్త్రచికిత్స చేసి కట్టుకట్టారు. నాలుగు రోజుల క్రితం వెంటిలేటర్ తొలగించారు. సహజ పద్ధతిలో ఆక్సిజన్ అందిస్తున్నారు. అయితే ఇప్పటికే రెండు మూడు సార్లు ఫిట్స్ రావడంతో వైద్యుల పరిశీలనలో ఉంచారు. మరోసారి ఫిట్స్ వస్తే...మళ్లీ వెంటిలేటర్ అమర్చాల్సి ఉంటుందని ఆ చిన్నారికి శస్త్రచికిత్స చేసిన సీనియర్ న్యూరోసర్జన్ డాక్టర్ బి.జె.రాజేశ్ తెలిపారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement